ఇదీ.. సున్నం రాజ‌కీయ జీవితం

by  |
ఇదీ.. సున్నం రాజ‌కీయ జీవితం
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: కరోనాతో మృతిచెందిన సున్నం రాజయ్యకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. ఆయన చేసిన సేవలు మరువలేనివి. సీపీఎం అభ్య‌ర్థిగా ఆయ‌న 1999, 2004, 2014లో భద్రాచలం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో సీపీఎం పార్టీ త‌రుపున సిట్టింగ్ స్థానం భద్రాచలం నుంచి పోటీ చేసిన ఆయ‌న కుంజా స‌త్య‌వ‌తి చేతిలో ఓడిపోయారు. 2014 లో భద్రాచలం నుండి తిరిగి శాసనసభకు ఎన్నికయ్యారు. నిరాడంబర‌మైన జీవితాన్ని ఆయ‌న కొన‌సాగించారు. ప్రజా సమస్యల కోసం పోరాడిన‌ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన నిత్యం ద్విచక్రవాహనం, ఆర్టీసీ బస్సుల్లోనే తిరిగేవారు.

రాష్ట్ర విభజన తరువాత ఉమ్మ‌డి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిసిపోయాయి. భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం పట్టణం మినహా మిగతా మండలం అంతా, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలు.. పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు, అశ్వారావు పేట నియోజకవర్గంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను ఏపీలో కలిపారు. వీటిలో కొన్ని మండలాలు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా ఏపీలో కలిశాయి. రాజయ్య అంతవరకు ప్రాతినిధ్యం వహించిన భద్రాచలం నియోజకవర్గంలోని అత్యధిక ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లోని రంపచోడవరం నియోజకవర్గం పరిధిలోకి వెళ్లాయి. వీటిలో భద్రాచలం నియోజకవర్గం నుంచి వేరయిన నాలుగు మండలాలను ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో.. పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని మండలాలను పశ్చిమగోదావరి జిల్లాలో కలిపారు.

ఈ ఏడు మండలాల్లోని 211 గ్రామాల బదలాయింపునకు సంబంధించి కేంద్రం చట్టం కూడా చేసింది. అప్పటివరకు భద్రాచల నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నవారిలో అత్యధికులు రంపచోడవరం నియోజకవర్గ ఓటర్లుగా మారారు. మరికొందరు పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గ పరిధిలోకి వెళ్లిపోయారు. సున్నం రాజయ్య వీఆర్‌పురం మండ‌లం రంప‌చోడ‌వ‌రం ప‌రిధిలోకి వెళ్లిపోయింది. దాంతో రాజయ్య 2019 ఎన్నికల్లో రంపచోడవరం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు.



Next Story

Most Viewed