ప్రచారంలో కొత్త పుంతలు.. డిజిటల్ క్యాంపెయిన్‌ వైపే మొగ్గు

by  |
ప్రచారంలో కొత్త పుంతలు.. డిజిటల్ క్యాంపెయిన్‌ వైపే మొగ్గు
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఇప్పుడంతా డిజిటల్ మయం. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నికల ప్రచారంలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో ఎలక్షన్స్ వచ్చాయంటే ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించేవారు. కానీ ఎన్నికల క్యాంపెయిన్ లో కూడా భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు నాయకులంతా సోషల్ మీడియా ప్రచారం పైనే ఆధారపడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ వైపు సాధారణ ప్రచారం చేస్తూనే మరో వైపు సామాజిక మాధ్యమాలైనటువంటి ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా గ్రాం ద్వారా యువతను ఆకట్టుకునేలా ఎక్కువగా ప్రచారం చేయిస్తున్నారు. ఒక పార్టీని మించి మరో పార్టీ అభ్యర్థి పోటీపడి మరి ట్రెండ్ కు తగ్గట్టు డిజిటల్ క్యాంపెయిన్ చేయిస్తున్నారు. తమ ప్రోగ్రామ్స్, షెడ్యూల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

అంతా మయాజాలం..

రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో చేసే పోస్ట్ లకు గ్రాఫిక్స్ జోడిస్తూ జనాలను మరింతగా ఆకట్టుకునేలా మాయ చేస్తున్నారు. తమ వీడియోలు, ఫొటోలు, వాయిస్ లను పలు రకాల ఎఫెక్ట్స్ తో తీర్చిదిద్ది షేర్ చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల వాయిస్ లు, వీడియోలను పక్కపక్కన ఉంచి పోల్చుతూ గ్రాఫిక్స్ జోడిస్తున్నారు. అంతేకాదు.. మంచి మంచి కొటేషన్లు, ఫొటోల మార్ఫింగ్ చేస్తూ షేర్ చేస్తున్నారు. వీడియోలకు సంబంధించి లింకు లను కూడా ఆసక్తికర కొటేషన్స్ తో సామాజిక మాధ్యమాల్లో వదులుతున్నారు. కొన్నికొన్ని విషయాలను ఎక్ల్సూజివ్స్ పేరిట వైరల్ చేస్తూ విపరీతమైన పబ్లిసిటీ సంపాదిస్తున్నారు.

ప్రత్యేకంగా టీంల ఏర్పాటు..

అన్ని పార్టీలూ ఇప్పటి వరకు ప్రత్యేకంగా సోషల్ మీడియా వింగ్ ను ఏర్పాటు చేసుకున్నాయి. వారికి ఆకర్షణీయమైన జీతం ఇచ్చి పార్టీ కార్యకలాపాలు, కార్యక్రమాలు, నేతలకు సంబంధించిన విషయాలతో పాటు ప్రస్తుతం ట్రెండింగ్ ఉన్న అంశాలకు పార్టీ కార్యక్రమాలతో జోడించడం.. ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టేలా వీడియోలను షేర్ చేస్తున్నారు. అయితే ఇప్పడు నేతల దృష్టి పర్సనల్ గా సామాజిక మాధ్యమాల వైపు మళ్లుతున్నాయి. డిజిటల్ మీడియా ద్వారా క్యాంపెయిన్ కోసం ఎవరికి వారు ప్రత్యేకించి మనుషుల్ని కేటాయించుకుంటున్నారు.

యువత చేతిలో ‘సోషల్’ అస్త్రం..

సోషల్ మీడియాలో నేతలు తమ కోసం ప్రచారం చేయించుకోవడం ఒక ఎత్తయితే.. ప్రత్యర్థి పార్టీల తరఫున తప్పుడు ప్రచారం చేయడం.. వారిని ఇరుకున పెట్టేలా పలు పోస్టులను కూడా వైరల్ చేపిస్తున్నారు. ఫలితంగా రెండు విధాలుగా లాభం కలుగుతోంది. అంతేకాదు.. సామాన్య ప్రజానీకం మొదలు యువత వరకు ఎవరైనా తమకు నచ్చిన, నచ్చని విషయాలను షేర్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో అస్త్రంగా మారింది. అయితే ఈ డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా సమయం ఆదాతో పాటు, ఏకకాలంలో విస్తృతంగా ప్రచారం జరుగుతుండడం, ఆర్థికంగా కూడా కలిసొచ్చే అంశం కావడంతో ఇప్పుడు అన్నివర్గాల చూపు సోషల్ మీడియావైపే ఉంది.


Next Story

Most Viewed