కమలాపూర్‌లో పోలీసుల కళ్లుగప్పుతున్న స్మగ్లర్లు

by  |
కమలాపూర్‌లో పోలీసుల కళ్లుగప్పుతున్న స్మగ్లర్లు
X

దిశ ,కమలాపూర్: హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని వంగపల్లి క్రాస్ రోడ్ వద్ద శనివారం సాయంత్రం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ఆటోలో పెద్ద మొత్తంలో అక్రమ రవాణా చేస్తున్న పేలుడు పదార్థాలకు సంబంధించిన జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రిక్ డిటోనేటర్ లను, వాటిని రవాణా చేస్తున్న వారిని పట్టుకుని కేసు నమోదు చేయడం జరిగిన విషయం విదితమే.

సహజంగా బావులలో, గ్రానైట్, క్రషర్ వంటి భారీ సైజు లో ఉన్న పెద్ద, పెద్ద బండరాళ్లను పెకలించటానికి, పగుల కొట్టడానికి, విడదీయడానికి జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రిక్ డిటోనేటర్ల వంటి పేలుడు పదార్థాలను ఉపయోగిస్తారు. ఇటువంటి పేలుడు పదార్థాలను ఉపయోగించేటప్పుడు అనుభవజ్ఞులైన, అనుమతులు పొందిన వారితో సంప్రదించి వాటిని ఉపయోగించే పరిసర ప్రాంతాలలో, జనావాసాలలో దగ్గరగా ఉన్న వారిని సూచనలు చేసి పలు జాగ్రత్తలు తీసుకుని వీటిని ఉపయోగిస్తారు. కానీ, కొంతమంది వ్యాపారులు వారి లాభాల కోసం ఇష్టానుసారంగా అనుమతులు లేకుండా ఎవరికి పడితే వారికి నిత్యవసర వస్తువులు సరఫరా చేసినట్లు సరఫరా చేస్తూ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

పేలుడు పదార్థాలు అమ్మినప్పుడు కొనుగోలు చేసిన వారికి అనుమతులు ఉన్నాయ? వాటిని వేటికీ వినియోగిస్తారు? ఎలా వినియోగించాలో తెలుసా? అని తెలుసుకోకుండానే లాభాపేక్ష కోసం ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారు. ఇటువంటి ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను రవాణా చేస్తున్నప్పుడు రవాణా విషయంలో పలు జాగ్రత్త లను సంబంధిత అధికారులు, తయారుచేసే కంపెనీలు పలు సూచనలు చేసినా కానీ, వాటిని పెడచెవిన పెట్టి ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా ఇష్టానుసారంగా అక్రమ రవాణా చేస్తున్నారు. వీటి వినియోగం పై అవగాహన లేని వారు వినియోగించిన లేదా ఇటువంటి రవాణా సమయంలో మార్గమధ్యలో, జనావాసాల మధ్య, గ్రామాలలో ఎక్కడైనా ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇటువంటి వాటిపై ఎప్పటికప్పుడు దృష్టి సారించి మళ్లీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.



Next Story

Most Viewed