సెల్యూట్ : ఇద్దరి ప్రాణాలను కాపాడిన పోలీసులు

by  |
Dindi Police
X

దిశ, డిండి: కుటుంబ తగాదాలతో ప్రాణం తీసుకోవాలని అనుకున్న మహిళకు పోలీసులు పునఃజన్మ ప్రసాదించారు. తల్లితోపాటు కూతురును కాపాడి ఇద్దరి ప్రాణాలు నిలిపారు డిండి పోలీసులు. బుధవారం డిండిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్ఐ పోచయ్య వెల్లడించారు. డిండి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన కనుకోటి మాధవి (30), శ్రీనివాస్ చారి భార్యభర్తలు. వీరికి ఓ కూతురు ఉన్నది. మాధవి టైలరింగ్ చేస్తుండగా శ్రీనివాస్ చారి కార్పెంటర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

Police rescue

కాగా, వీరి కుటుంబంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన మాధవి తన పాపతో కలిసి డిండి ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు అక్కడికి వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన పర్యాటకులు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన డిండి ఎస్ఐ పోచయ్య తన సిబ్బందితో వెళ్లి ఆత్మహత్య చేసుకోబోతున్న మాధవిని అడ్డుకున్నారు. ఆమెను, చిన్నారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఆమెను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. సకాలంలో స్పందించి ఇద్దరి ప్రాణాలను కాపాడిన డిండి పోలీసులను పర్యాటకులతోపాటు జిల్లా ప్రజలు అభినందించారు.


Next Story

Most Viewed