సైబర్ నేరగాళ్ల ఆటకట్టించిన పోలీసులు.. డబ్బులు రికవరీ…

by  |
సైబర్ నేరగాళ్ల ఆటకట్టించిన పోలీసులు.. డబ్బులు రికవరీ…
X

దిశ, మణుగూరు : అశ్వాపురం మండలంలో సైబర్ నేరగాళ్ల మోసంతో భారజల కర్మాగారం ఉద్యోగి మోసపోయారు. ఉద్యోగి దేవళ్ల దామోదర్ కు గత నెల 20న మొబైల్ నెంబర్ కు ఆధార్ లింకు చేసుకోవాలనే సందేశంతో లింకును సైబర్ నేరగాళ్లు పంపించారు. విషయం తెలియని దామోదరరావు తన మొబైల్ నెంబర్ కు వచ్చిన మొబైల్ నెంబర్ కు ఫోన్ చేయటంతో సైబర్ నేరగాళ్లు రూ.10 పంపిస్తే ఆధార్ లింక్ అయిందో లేదో చూస్తామని తెలపడంతో దామోదరరావు తన నెట్ బ్యాంక్ ఖాతా నుండి రూ.10 పంపించారు.

దీంతో అతని బ్యాంకు అకౌంటు నుండి రూ 6.20 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు మాయం చేశారు. నగదు విత్ డ్రా అయినట్టు సందేశం రావడంతో మోసపోయానని గ్రహించిన ఉద్యోగి వెంటనే అశ్వాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన మణుగూరు ఏఎస్పి డాక్టర్ శబరీష్ ఆధ్వర్యంలో అశ్వాపురం సీఐ సట్ల రాజు ప్రత్యేక చొరవ తీసుకుని సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో సైబర్ నేరగాళ్లు దొంగిలించిన నగదుతో ఆన్లైన్ షాపింగు చేయగా అట్టి వస్తువులను డెలివరీ కాకుండా ఆపి రూ. 4.5 లక్షల రూపాయలను పోలీసులు రికవరీ చేశారు.

ఈ సందర్భంగా మణుగూరు ఏఎస్పి డాక్టర్ శబరీష్ మాట్లాడుతూ… సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ లావాదేవీలలో మెళకువలను పాటించాలని బ్యాంకు ఆధార్ కార్డు లింక్ ల పేరుతో వచ్చే ఫోన్ల ను సందేశాలను ప్రజలు స్పందించకూడదని అన్నారు. సైబర్ నేరగాళ్ల మోసాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. సైబర్ నేరగాళ్ల మోసాన్ని చేధించి నగదును రికవరీ చేసిన సైబర్ క్రైమ్ పోలీసుల సిబ్బందిని, అశ్వాపురం సిఐ సట్ల రాజును ఏఎస్పి అంభినందించారు.

Next Story