క్యూ న్యూస్ ఆఫీసులో పోలీసుల సోదాలు.. మల్లన్న టీమ్ ఆగ్రహం

by  |
Police raids at Q News office
X

దిశ, మేడిపల్లి: టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ మన్నే క్రిషాంక్ ఫిర్యాదు మేరకు సీసీఎస్, సైబర్ క్రైమ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం మేడిపల్లి పీఎస్ పరిధి పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని క్యూ న్యూస్ కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులు మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని, సర్కారు చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారని తెలిపారు. గత కొన్ని రోజులుగా కేసీఆర్ సర్కార్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలు, అవినీతిపై నిత్యం వార్తలు వేస్తున్నందుకే మల్లన్నపై సర్కారు క్షక్ష గట్టిందని వెల్లడించారు.

బుధవారం మధ్యాహ్నం సమయంలో దాదాపు 20 మంది పోలీసులు మా ఇంట్లోకి ప్రవేశించి భయబ్రాంతులకు గురిచేశారని మల్లన్న కుటుంబసభ్యులు తల్లి జనమ్మ, భార్య మమతా, సోదరుడు వెంకటేష్‌లు మీడియా ముందు వాపోయారు. సుమారు గంటపాటు ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు, ఎవర్నీ కదలనీయకుండా కూర్చోబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తుంటే మనం తెలంగాణ బతుకుతున్నామా? లేక ఇతర దేశాల్లో బతుకుతున్నామా అనే అనుమానం వ్యక్తం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయం, ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారనే సమాచారంతో క్యూ న్యూస్ కార్యాలయం వద్దకు చేరుకున్న స్థానిక మీడియా ప్రతినిధులను టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులోకి తీసుకొని మేడిపల్లి పీఎస్‌లో అప్పగించారు. అయితే, దీనిపై ఇతర మీడియా ప్రతినిధులు ఆందోళన చేస్తారనే సమాచారం మేరకు స్థానిక పోలీసులు మీడియా ప్రతినిధులను పంపించారు.


Next Story

Most Viewed