మహాపాదయాత్రలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్

by  |
మహాపాదయాత్రలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతియే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొనసాగుతుంది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు నుంచి గురువారం పాదయాత్ర ప్రారంభమైంది. భారీ వర్షంలో సైతం మహిళా రైతులు, అమరావతి జేఏసీ నేతలు పాదయాత్ర నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్దకు చేరుకునే సరికి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహాపాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు రైతులు పెద్ద ఎత్తున వచ్చారు. అయితే వారిని పాదయాత్రలో పాల్గొనకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రైతులపై లాఠీ ఝులిపించారు. ఈ లాఠీఛార్జ్‌లో సంతనూతలపాడుకు చెందిన రైతు నాగార్జున చెయ్యి విరిగిపోగా..మరికొందరు గాయాలపాలయ్యారు. ఇదిలా ఉంటే మహాపాదయాత్రలో పాల్గొనకుండా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలను, నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

లాఠీచార్జ్ దుర్మార్గం: నారా లోకేశ్

నాగులుప్పలపాడు మండలం చదలవాడ పోలీసులు లాఠీ ఛార్జ్లో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని లోకేష్ డిమాండ్ చేశారు. న్యాయస్థానాల ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఉద్యమకారులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కూ అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్ర జ‌గ‌న్ స‌ర్కారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోందన్నారు. పోలీసుల్ని ప్రయోగించి పాద‌యాత్రకి అడుగ‌డుగునా ఆటంకాలు క‌ల్పించ‌డం న్యాయ‌మా? అంటు ప్రశ్నించారు. హైకోర్టు అనుమ‌తితో చేస్తున్న పాద‌యాత్రకి ఖాకీల ఆంక్షలు ఎందుకన్నారు. క‌వ‌రేజ్‌కి వ‌చ్చిన‌ మీడియా ప్రతినిధుల్ని ఎందుకు ఆపుతున్నారు? ’అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు.

ప్రభుత్వం వెన్నులో వణుకుపుట్టించింది: ధూళిపాళ్ల నరేంద్ర

అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రభుత్వం వెన్నులో వణుకుపుట్టించిందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. ‘రైతులను అడుగడుగునా అడ్డుకోవడం, సంఘీభావం ప్రకటించిన వారిని అక్రమ అరెస్టు చేయడమే ఇందుకు నిదర్శనం అన్నారు. హైకోర్టు అనుమతి ఉన్న పాదయాత్రకు ఎన్నికల కోడ్ పేరుతో పోలీసులతో బెదిరించడం, భయపెట్టడం వంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వ భయానికి నిదర్శనం’ అని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు.

అమరావతియే ఏకైక రాజధాని: మాజీమంత్రి నక్కా ఆనందబాబు

రైతుల పాదయాత్ర ఆపాలనుకుంటే అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని ఆనందబాబు అన్నారు. రాజధాని గ్రామాల్లోనే ఉద్యమం ఉందన్న వైసీపీ నేతల నోళ్లు ఈ పాదయాత్రతో మూగబోయాయన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు ప్రభుత్వం భయపడుతుందని.. మానవ హక్కుల ఉల్లంఘనపై కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసిన సిగ్గు రావడం లేదు అని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు.

కోర్టు అనుమతించిన వారే పాదయాత్రలో పాల్గొనాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్

అమరావతి రైతుల మహాపాదయాత్రపై ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని వెల్లడించారు. కోర్టు అనుమతించిన వారు మాత్రమే పాదయాత్రలో కొనసాగాలని సూచించారు. మహాపాదయాత్రకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఎవరికీ అనుమతి లేదని చెప్పుకొచ్చారు. అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మల్లికా గార్గ్ హెచ్చరించారు.


Next Story

Most Viewed