అధిక వడ్డీ ఇస్తామని.. చైనీయుల భారీ మోసం

by  |
అధిక వడ్డీ ఇస్తామని.. చైనీయుల భారీ మోసం
X

దిశ, క్రైమ్ బ్యూరో: చైనా దేశానికి చెందిన కొందరు ఎక్కువ వట్టీ చెల్లిస్తామని ఆశ చూపి భారీ మొత్తంలో వసూలు చేశారు. గతంలో క్రిప్టో ట్రేడర్స్, బెట్టింగ్ ఆన్ లైన్ రమ్మీ, లోన్ యాప్స్ పేరుతో మోసాలకు పాల్పడ్డ చైనా దేశస్తులు తాజాగా షేరింగ్ ఎకానమీ పేరుతో పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారికి ప్రతి రోజూ 11 శాతం వడ్డీ ఇస్తామంటూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఇండియా కంపెనీలను చైనా వెబ్‌సైట్‌లకు లింక్ చేశారు. దీంతో దేశంలో సుమారు 20 వేల మంది నుంచి రూ.50 కోట్లకు పైగా వసూలు చేసినట్టు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేయగా, ఇద్దరు చైనీయులు ఆ దేశంలోనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను గచ్చిబౌలి కార్యాలయంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు సోమవారం వెల్లడించారు.

బైకులు కొనుగోలు చేసి, అద్దెకు ఇస్తున్నట్టుగా సీసీ సీయో డాట్ కామ్ పేరుతో ఓ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసిన మోసగాళ్లు.. తమ వద్ద పెట్టుబడులు పెడితే రూ.300లకు రోజుకు రూ.15 చొప్పున 90 రోజుల్లో రూ.1350లు, రూ.3 వేలకు 90 రోజుల్లో రోజుకు రూ.150 చొప్పున రూ.13,500 చెల్లిస్తామని అమాయకుల నుంచి పెట్టుబడులు స్వీకరించారు. ఈ పెట్టుబడులు మరింత ఈజీగా ఉండేందుకు షేర్డ్ బీకే (బైక్) యాప్‌ను తయారు చేశారు. అధిక వడ్డీకి ఆశపడి దేశ వ్యాప్తంగా దాదాపు 20 వేల మంది రేజర్ పే ద్వారా గేట్ వే చెల్లింపులు చేశారు. ఇలా సుమారు రూ.50 కోట్టుకు పైగా దోచుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

ఆ ఇద్దరే కీలకం..

గుర్గావ్‌కు చెందిన ఉదయ్ ప్రతాప్ 2016లో చైనాకు చెందిన టాప్1మోబీ టెక్నాలజీ కంపెనీలో పనిచేశారు. ఈ సమయంలో ఈ కంపెనీని లీడ్ చేసిన పెంగ్వాయ్ తో అతనికి పరిచయం ఏర్పడింది. అనంతరం కంపెనీ వారు ఉదయ్‌ప్రతాప్‌ను మోబీసెంట్రిక్ కంపెనీకి ఆథరైజ్డ్ పర్సన్‌గా నియామించారు. గుర్గావ్ కేంద్రంగా నడిచే కార్పోర్ ‌ఫౌంటేయిన్ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నాడు. హాంకాంగ్ కేంద్రంగా నడిచే యాడ్ స్టక్ కన్సల్టెన్సీని 2017లో, ఇనావిట్ సర్వీసెస్ ను 2018లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరో మూడు కంపెనీలను ప్రారంభించారు. వీటిలో ఉదయ్‌ప్రతాప్‌తో పాటు సీసీసియో డాట్ కమ్ వెబ్‌సైట్‌కు ఢిల్లీకి చెందిన నితేశ్ కుమార్, గుర్గావ్‌కు చెందిన రాజేశ్‌శర్మ (షేర్డ్ బీకే యాప్‌ను డెవలప్ చేసిన వ్యక్తి) సైతం పలు కంపెనీల్లో డైరెక్టర్లుగా నియమించారు. ఇదిలా ఉండగా, పెంగ్వాయ్ 2020లో చైనాకు చెందిన పీటర్‌.. ఉదయ్ ప్రతాప్‌కు పరిచయం చేశాడు. 2020‌లో లాక్ డౌన్ కంటే ముందుగా చైనా వెళ్లిన పెంగ్వాయ్.. ఆ తర్వాత ఇండియాకు తిరిగి రాలేదు. పీటర్ అసలు ఇండియానే రాలేదు. ఇండియాలో ఉన్న 8 కంపెనీల్లో ఏ ఒక్క కంపెనీకీ అడ్రస్ లేకపోవడం గమనార్హం. షేర్డ్ బీకే యాప్ ను వాట్సాప్ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేసి.. మొత్తం చైనాలో లింక్స్‌గా ఉన్నవెబ్స్ సైట్ లింక్స్ ఆధారంగానే ఈ మోసాలకు పాల్పడ్డారు. ఈ మోసాలకు చైనాకు చెందిన పెంగ్వాయ్, పీటర్ ప్రధాన నిందితులు. చైనా నుంచి వీరు ఇచ్చిన ఆదేశాలతో ఇండియాలోని ఉదయ్ ప్రతాప్, నితేశ్ కుమార్, రాజేష్ శర్మలు పనిచేశారు.

చైనా వెబ్‌సైట్‌తో కంపెనీల లింక్

రేజర్ పే గేట్ వే ద్వారా చెల్లింపులు చేసేందుకు మొబైల్ నెంబరు తదితర వివరాలు అందజేయాలనే కచ్చితమైన నిబంధనలు ఉండటాన్ని గమనించాడు చైనాకు చెందిన పెంగ్వాయ్. ఉదయ్ ప్రతాప్‌ అనే వ్యక్తిని హైదరాబాద్ కూకట్‌పల్లిలో (ఫేక్ అడ్రస్) ఉన్న మోబీ సెంట్రిక్ టెక్నాలజీస్ కంపెనీలో డైరెక్టర్‌గా, ఆథరైజ్డ్ పర్సన్‌గా నియమించాడు. ఇదే తరహాలో బెంగుళూరులో ఆలీదాదా, గెల్‌టెక్ , కాన్పూర్ లో ఆషెన్ ఫెలోస్, బ్రిడ్జ్ తేరా, టోనింగ్ వరల్డ్, పూణెలో సైబర్ టెల్, ఢిల్లీలో టెక్ డిగ్ కంపెనీలను ఏర్పాటు చేశారు. ఇండియాలోని ఈ 8 కంపెనీలను చైనాలోని 8 వెబ్‌సైట్‌లకు లింక్ చేశారు. ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు రేజర్ పే ద్వారా చేసే గేట్ వే చెల్లింపులన్నీ నేరుగా చైనాలో లింక్ చేసిన వేర్వేరు వెబ్‌సైట్‌లకు యాడ్ అయ్యేలా చేశారు. షేర్డ్ బీకే యాప్‌లో మన చెల్లింపులు, చెల్లింపులకు వచ్చే మొత్తం కన్పించేలా యాప్‌ను క్రియేట్ చేశారు. దీంతో చాలా మంది వారి వలలో పడ్డారు. వారం రోజుల క్రితం ఈ మోసాలకు సంబంధించి ఓ బాధితుడు రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఉదయ్ ప్రతాప్, నితేశ్ కుమార్, రాజేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి 10 బ్యాంకులకు సంబంధించిన సుమారు రూ.3 కోట్లను ఫ్రీజ్ చేయించారు. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే దురాశే ప్రజలు మోసపోయేలా చేస్తోందని, ఇకనైనా ఇలాంటి వాటిని ప్రజలు గమనించి పోలీసులకు సమాచారం అందించాలని సీపీ సూచించారు.



Next Story

Most Viewed