బోర్డర్‌లో డ్రోన్ చక్కర్లు.. అగ్రనేతలే మెయిన్ టార్గెట్

by  |
బోర్డర్‌లో డ్రోన్ చక్కర్లు.. అగ్రనేతలే మెయిన్ టార్గెట్
X

దిశ ప్రతినిధి, ఖమ్మం : మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణలోకి ప్రవేశించారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. పోలీసులు కొత్త టెక్నాలజీతో ముందుకు పోతుంటే.. మావోయిస్టులు మాత్రం ‘పాత అస్త్రాలనే’ కొత్త వ్యూహంగా అమలు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో భారీస్థాయిలో బూబీట్రాప్స్ బయటపడటం పోలీసులను విస్మయానికి గురిచేసింది. రెండ్రోజుల కిందట కొత్తగూడెం అటవీ ప్రాంతంలో ఇద్దరు మిలీషియా సభ్యులు, సరిహద్దులో ఏడుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేయగా, వారి వద్ద పేలుడు పదర్థాలతోపాటు వెదురు బొంగులు, ఖాళీ బీరుబాటిళ్లు, విల్లంబులు, డైరెక్షనల్ మైన్ ట్రిగ్గర్లకు సంబంధించిన సామగ్రి లభించింది.

మావోయిస్టులను గుర్తించిన ‘డ్రోన్’

మావోయిస్టుల కదలికలను గుర్తించడానికి పోలీసులు డ్రోన్ వీడియో కెమెరాలను ఉపయోగిస్తున్నారు. వీటి సహాయంతో నాలుగు నెలల కిందట పాలడవి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలను పసొగట్టారు. వందల సంఖ్యలో వారంతా ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వైపు వస్తున్నట్లు గుర్తించారు. వీరిలో అగ్రనేతలు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. మావోయిస్టు పార్టీ సభ్యుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆధ్వర్యంలో మావోయిస్టుల బృందం భద్రాద్రి అటవీ ప్రాంతంలో తిరుగుతున్నట్లు, ఇప్పటికే తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో కొందరు అగ్రనేతలు మకాం వేసినట్లుగా భావిస్తున్నారు. అందుకే కొన్ని నెలలుగా సరిహద్దు అటవీ ప్రాంతాలు, ఏజెన్సీ పల్లెలలో భద్రతా బలగాలు భారీ ఎత్తున కూంబింగ్ మొదలు పెట్టాయి.

భారీ యాక్షన్ ప్లాన్..

భద్రతా బలగాలను హతమార్చేందుకు మావోయిస్టులు తమ పంథా మార్చినట్లు తెలుస్తోంది. మిలీషియా సభ్యులను అరెస్ట్ చేసినపుడు వారి వద్ద పేలుడు సామగ్రి దొరికింది. సరిహద్దు ప్రాంతంలో ల్యాండ్ మైన్స్ అమర్చుతున్న ఏడుగురు నక్సల్స్‌ను అరెస్ట్ చేసినపుడు కూడా భారీగా ల్యాండ్ మైన్స్, వెదురు బొంగులతో కూడిన డెరెక్షనల్ మైన్ ట్రిగ్గర్స్, జిలిటిన్ స్టిక్స్, బాణాలు తదితర సామగ్రి బయట పడడం చూస్తుంటే కూంబింగ్ దళాలే లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నట్లు పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పూసుగుప్ప (తెలంగాణ) రాంపురం(ఛత్తీస్‌గఢ్) గ్రామాల నడుమ గల అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తు్న్న చర్ల పోలీసులు ఆ ప్రాంతంలో 78 చోట్ల భారీ గోతులు తీసి అమర్చిన 100 బూబీట్రాప్స్ వెలికితీశారు. దీంతో బలగాలకు పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. మావోయిస్టు అగ్రనేతలు హరిభూషణ్, దామోదర్, ఆజాద్, శారదక్క ఆదేశం మేరకు రాంపురం, భీమారం, పూసుగుప్ప గ్రామాల మిలీషియా సభ్యులు, మావోయిస్డు దళ సభ్యులు కలిసి ఈ బూబీట్రాప్స్ అమర్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.

మహా డేంజర్..

మావోయిస్టులు బూబీట్రాప్స్ అనే పాత విధానాన్నే అమలు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. తమను వేటాడటానికి వచ్చే పోలీసుల కోసం వీటిని భూమిలో అమర్చుతారు. వీటికి చిక్కి పడిపోయిన తర్వాత లేవడం అంత సులభం కాదు. ఎక్కువ స్థాయిలో ప్రాణనష్టం ఉండే విధంగా చూడడమే బూబీ ట్రాప్స్ ప్రధాన ఉద్దేశం. ఇది పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. యువత మావోయిస్టులకు సహకరించడం కానీ, వారి వలలో చిక్కి వారికి అనుగుణంగా పనిచేయడం కానీ చేయవద్దని, అలా చేస్తే విలువైన జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Next Story

Most Viewed