లాక్ డౌన్ ఉల్లం'ఘనుల'పై కొరడా

by  |
లాక్ డౌన్ ఉల్లంఘనులపై కొరడా
X

దిశ, న్యూస్ బ్యూరో:
కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘లాక్‌డౌన్’ను ఉల్లంఘించినవారిపై నగర పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ బుధవారం ఉదయం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసి లిఖితపూర్వకంగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీంతో లాక్‌డౌన్‌ను నిర్లక్ష్యం చేసి ఇంతకాలం రోడ్లమీదకు వచ్చిన వాహనాలను గుర్తించి వాటిపై కేసులు నమోదు చేసి చలాన్లు పంపే కార్యక్రమం షురూ అయింది. గత నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూ జరగ్గా ఆ మరుసటి రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నిర్ణయం తీసుకుంది. అయినా ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ రోడ్ల మీదకు గత నెల 23 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు వచ్చిన వాహనాల లెక్కలు తీశారు. మొత్తం 93,393 టీ వీలర్ బైక్‌లు, 988 ఆటోలు, 5,041 కార్లు రోడ్ల మీదకు వచ్చినట్లు సీసీటీవీ కెమెరా పుటేజ్ ద్వారా పోలీసులు లెక్కతీశారు.

ఈ వాహనాల యజమానులపై ఉల్లంఘన చట్టం కింద కేసులు నమోదు చేశారు ట్రాఫిక్ పోలీసులు. సరైన కారణం లేకుండా 13,249 బైక్‌లు, 1,999 ఆటోలు, 1,372 కార్లు రోడ్లపైకి వచ్చినట్లు పోలీసులు తేల్చారు.
మొత్తం రోడ్లమీదకు వచ్చిన వాహనాల సంఖ్య 1.78 లక్షలైతే ట్రాఫిక్ పోలీసులు మాత్రం 16,651 మందిపై కేసులు నమోదు చేశారు. ఇంకా కొన్ని వాహనాలకు కేసులు జారీ చేయాల్సి ఉందని తెలిపారు. ఇవి కాక సుమారు ఐదు వేల బైక్‌లు, 471 ఆటోలు, 243 కార్లను సీజ్ చేసినట్లు నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా, పోలీసులు లాఠీఛార్జీ చేస్తున్న రోడ్లమీదకు పనిలేకుండా వస్తున్నవారిపై సీరియస్‌గానే వ్యవహరించాలని భావిస్తోంది. అందులో భాగంగానే కేసుల నమోదు ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ నెల 14వ తేదీ వరకూ లాక్‌డౌన్ కొనసాగనున్నందున కరోనా వ్యాప్తిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు వీలుగా రోడ్లమీదకు వచ్చేవారిని నిలువరించడానికి ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Tags: Telangana, LockDown, Roads, Bikes, Vehicles, Traffic Police



Next Story

Most Viewed