దాబాలో రూ.100 బిల్లు కట్టలేక.. 12 నాన్ బెయిలబుల్ కేసులు, జైలు శిక్ష వేసిన పోలీసులు

by  |
దాబాలో రూ.100 బిల్లు కట్టలేక.. 12 నాన్ బెయిలబుల్ కేసులు, జైలు శిక్ష వేసిన పోలీసులు
X

దిశ,వెబ్‌డెస్క్: పోలీసులు చెప్పిన పని చేయకపోతే ఏం చేస్తారు? ఉన్నవి, లేనివి కేసులు బనాయించి జైల్లో వేస్తారు. ఇలాంటి సీన్లు రీల్ లైఫ్ లోనే కాదూ రియల్ లైఫ్ లో కూడా జరుగుతుంటాయి.

ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఓ యువకుడు పొట్టకూటి కోసం ఓ చిన్న దాబాను నిర్వహిస్తున్నాడు. అయితే ఆ దాబాలో చిరు తిండ్లు తిన్న పోలీసుల్ని సదరు దాబా ఓనర్ రూ.100 బిల్లు అడిగాడు. దీంతో బిల్లు అడిగిన పాపానికి దాబా ఓనర్, అతని స్నేహితులపై 12 అక్రమ కేసులు పెట్టి జైల్లో వేశారు.

ఫిబ్రవరి 4న ఉత్తర్ ప్రదేశ్‌లోని ఇతః అనే మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాలి దేహాట్ పోలీసులకు జాసర్ అనే గ్రామంలో నేరస్తులున్నారనే సమాచారం అందింది. దీంతో స్టేషన్ ఎస్సై ఇంద్రేష్ పాల్ సింగ్, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు శైలేంద్ర, సంతోష్ కుమార్’లు గ్రామంలో దాడులు జరిపారు. కానీ అక్కడ నేరస్తుల ఆచూకీ లభ్యం కాలేదు. ఉన్నతాధికారులకు మాత్రం ఎన్ కౌంటర్ జరిగిందని, గంజాయి, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందించారు.

అయితే గ్రామం నుంచి స్టేషన్ కు తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో పోలీసులకు ప్రవీణ్ కే యాదవ్ నిర్వహిస్తున్న దాబా కనబడింది. అంతే ఆ దాబాలోకి వెళ్లి తమకు కావాల్సినవి తిన్నారు. ఓనర్ ప్రవీణ్ బిల్లు రూ.450 అయ్యింది. మీరు రూ.100 ఇస్తే సరిపోతుందని పోలీసుల్ని కోరాడు. దీంతో ఆగ్రహానికి గురైన పోలీసులు మమ్మల్నే బిల్లు అడుగుతావా అంటూ నానా రాద్దాంతం చేసి వెళ్లిపోయారు.

కొద్దిసేపటికి మూడు జీబుల్లో వచ్చి దాబా నిర్వహిస్తున్న అన్నదమ్ముల్ని, స్థానికంగా ఉంటున్న యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఎక్సైజ్ చట్టం, మారణాయుధాల చట్టం, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (ఎన్‌డిపిఎస్) ఇలా మొత్తం 12 నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు.

అయితే ఈ కేసులపై కోర్ట్ విచారణ జరిపింది. విచారణ కొనసాగుతుండగానే బాధితుడు ప్రవీణ్ తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ ఉన్నతాధికారులకు పలుమార్లు లెటర్లు రాశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. వారం రోజుల క్రితం ఉన్నతాధికారులు స్పందించి ఎస్సైని, కానిస్టేబుళ్లపై విచారణకు ఆదేశించారు. విచారణలో పోలీసులు కావాలనే ప్రవీణ్ తో పాటూ యువకులపై అక్రమ కేసులు పెట్టినట్లు తేలింది. దీంతో బాధితులు ఈ కేసు నుంచి బయటపడ్డారు.

ఈ సందర్భంగా బాధితుడు ప్రవీణ్ మాట్లాడుతూ కొత్వాలి దేహాట్ పోలీసుల్ని సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎమ్మెన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో నా కుడికాలు కోల్పోవడంతో జీవనాధారం కోసం అన్న పుష్పేంద్ర యాదవ్ సహకారంతో దాబా నిర్వహిస్తున్నా. చిన్న దాబా నడిపే తనపై ఇన్ని కేసులు పెట్టడం తట్టుకోలేకపోయాను. అయినా చివరికి న్యాయమే గెలిచింది. కానీ పోలీసులు ఏం చేస్తారోనని భయంగా ఉంది. ఇదే విషయంపై పోలీస్ ఉన్నతాధికారులకు వివరించా. పోలీసులు అక్రమ కేసులు పెట్టడం వల్ల 40 రోజులు జైలు శిక్షను అనుభవించా. కుటుంబసభ్యులు, స్నేహితులు ఇంకా జైల్లోనే ఉన్నారు. వాళ్లు ఎప్పుడు విడుదలవుతారో తెలియదు’ అని దాబా ఓనర్ ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

కాగా బాధితులపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులపై విచారణకు ఆదేశించినట్లు అడిషనల్ ఎస్పీ రాహుల్ కుమార్ తెలిపారు. పోలీసులు.., స్థానిక లిక్కర్ డాన్ బంటు యాదవ్ నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తేలింది. కొత్తాలి దేహాట్ పోలీసుల్ని సస్పెండ్ చేసి విచారిస్తున్నామన్నారు.



Next Story

Most Viewed