ఉలిక్కి పడిన పోలీసులు… ఏమైందంటే!

by  |
ఉలిక్కి పడిన పోలీసులు… ఏమైందంటే!
X

దిశ, ఆదిలాబాద్: మహారాష్ట్రను ఆనుకొని ఉన్న అంతర్రాష్ట్ర అటవీ సరిహద్దులో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవైపు కరోనా ప్రభావంతో పోలీస్ యంత్రాంగం ఒత్తిడిలో ఉన్న తరుణంలో జిల్లాలోకి నక్సల్స్ చొరబడ్డారన్న సమాచారం పోలీస్ యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అయితే ప్రస్తుతం ఎంతో కొంత మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కాకుండా… రెండు దశాబ్దాల క్రితం వారికి ఆయువుపట్టుగా ఉన్న అటవీ ప్రాంతాల్లోకి నక్సల్స్ వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

రిక్రూట్ మెంట్ అనుమానాలతోనే…

కరోనా సమయంలో నక్సల్స్ అటవీ గ్రామాల్లోకి వెళ్లి రిక్రూట్ మెంట్ లకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సరిహద్దు గుండా ఉన్న అటవీ గ్రామాల్లో గ్రేహౌండ్స్ బలగాలు గాలింపును ముమ్మరం చేసినట్లు తెలుస్తోన్నది. ప్రస్తుతం పరిస్థితులను బట్టి జిల్లా అడవుల్లోకి నక్సల్స్ సునాయసంగా చొరబడే అవకాశం ఉందని పోలీసులు కూడా అంచనా వేస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంగి, చెన్నూరు, తిర్యాని, ఇంద్రవెల్లి, బోథ్, కడెం, ఖానాపూర్, సింగాపూర్, తదితర అటవీ ప్రాంతాల్లో దళాల సంచారం ముమ్మరంగా ఉండేది. ఇప్పటికీ ఈ ప్రాంతాల్లో దట్టమైన అడవులు ఉన్నాయి. దీంతో ఈ అటవీ ప్రాంతాల్లో ఉండే గ్రామాలను లక్ష్యంగా చేసుకుని నక్సల్స్ రిక్రూట్ మెంట్ కు పాల్పడే అవకాశం ఉండవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర ప్రాంతం నుంచి ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లోకి నక్సల్స్ వస్తారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఇప్పటికే కొందరు నేతలు జిల్లాలోకి వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.

కదలికలపై నిఘా…

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నక్సల్స్ కదలికలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. పోలీసుల నిర్బంధంతోపాటు పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమాలు అమలు చేసి అటవీ గ్రామాలపై పట్టు సాధించింది. అయితే జిల్లాకు చెందిన కొందరు అగ్రనేతలు రాష్ట్ర, కేంద్ర కమిటీ స్థాయిలో పని చేస్తున్నారు. జిల్లా కార్యదర్శి భాస్కర్ అలియాస్ మైలారపు అడెల్లు పోలీసులకు ప్రస్తుత టార్గెట్ గా మారారు. ఆయనతోపాటు మరికొంతమంది నక్సలైట్లు దళంలో పనిచేస్తున్నారు. వీరంతా ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ ప్రాంతంలోనే తల దాచుకున్నట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. కాగా కొంత కాలం నుంచి జిల్లా కార్యదర్శి భాస్కర్ అనారోగ్యంతో బాధ పడుతున్నారని పోలీసులకు తెలిసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయనతోపాటు, కొందరు సభ్యులు జిల్లా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన స్వస్థలం ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ ప్రాంతం. ఈ క్రమంలోనే బోథ్ ను ఆనుకొని ఉన్న తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారని తెలుస్తోన్నది. మూడు రోజులుగా ఈ ప్రాంతంపై గ్రేహౌండ్స్ పోలీసులు నిఘా పెంచి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Tags: adilabad, naxals, police, checks, borders, combing


Next Story