గంజాయికి బానిస.. రాత్రి వేళ దొంగతనాలు

by  |
గంజాయికి బానిస.. రాత్రి వేళ దొంగతనాలు
X

దిశ, రాజేంద్రనగర్: రాత్రి వేళలో బైక్ పై కాలనీల్లో చక్కర్లు కొడుతూ తాళం వేసిన ఇండ్లను గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలపూడి ప్రాంతానికి చెందిన మహమ్మద్ గౌస్ పాషా ఏడవ తరగతి వరకు చదివి మానేశాడు. 2011 నుంచి ఇప్పటివరకు 14 ఇంటి తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడడమే కాకుండా.. హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. నిందితుడు చివరిసారిగా నిజాం మ్యూజియం కేసులో అరెస్టు అయినా.. తిరిగి బయటకు వచ్చిన తర్వాత కూడా దొంగతనాలకు పాల్పడుతూనే ఉన్నాడు.

తాజాగా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు దొంగతనం కేసులు, గోల్కొండ పోలీస్ స్టేషన్లో మరో కేసు లో గౌస్ పాషా నిందితుడు. మరో 14 కేసుల్లో ఇతడు ప్రధాన నిందితుడు. ఇటీవల రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డెయిరీపామ్, సులేమాన్ నగర్ కాలనీల్లో రాత్రివేళల్లో వీరంగం సృష్టించిన ఘటనలో కూడా గౌస్ పాషా పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సోమవారం రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్ పోలీసులు గౌస్ పాషాను అరెస్ట్ చేసి.. అతని వద్దనుంచి రూ. 25 లక్షలు విలువ చేసే 50 తులాల బంగారు ఆభరణాలు, ఒక కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వివరించారు. నిందితుడు గౌస్ పాష గంజాయికి బానిసై రాత్రి సమయంలో రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడి చేసి డబ్బులు, బంగారం ఎత్తుకెళ్తుంటాడని చెప్పారు. ఇతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి పీడీయాక్ట్ కూడా నమోదు చేస్తామని శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి తెలిపారు.


Next Story

Most Viewed