నిజామాబాద్ లో జోరుగా జూదం.. ఆ స్థావరాలు ఇవే!

by  |
నిజామాబాద్ లో జోరుగా జూదం.. ఆ స్థావరాలు ఇవే!
X

దిశ, నిజామాబాద్: కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, ప్రజలు గుమి గూడవద్దు.. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి ఎవ్వరూ బయటకు రావొద్దని ప్రభుత్వం ఆంక్షలు విధించినా జూదరులు మాత్రం పట్టించుకోవడంలేదు. జోరుగా జూదం ఆడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం క్లబ్ లలో జూదాన్ని నిషేధించినా కొంతమంది జూదగాళ్లు కొత్త పద్ధతులలో నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పలు ఇండ్లు, అపార్ట్ మెంట్లు, వ్యవసాయ క్షేత్రాలు, గెస్ట్ హౌజ్ లు స్థావరాలుగా మలచుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు జూదం ఆడుతున్నారు. కొందరు వ్యక్తులు క్లబ్ ల స్థాయి కంటే మించి ఆడిస్తున్నారు. జూదం ఆడేవారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి వారికి అడ్డాలు, మద్యం, ఇతర సదుపాయాలను సమకూర్చుతున్నారు. ఆటగాళ్లు భారీ స్థాయిలో డబ్బులు పెట్టి ఆడుతున్నారు. ఇంకొందరైతే నగదు కొరత కారణంగా ఆన్ లైన్ మనీతో ఆడుతున్నారు. పంట ఉత్పత్తులు, ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులతో పలువురు రైతులు జూదం ఆడుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఇటీవల..

గత నెల రెండో వారంలో కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని ఒకరి పొలంలో ఉన్న గుడిసెలో జూదం ఆడుతూ పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పోలీసులు రూ. లక్ష నగదును స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని ఒక గ్రామ శివారులో ఉన్న తోటలో రెండు గ్రామాల సర్పంచులు, పలువురు వ్యక్తులు పట్టుబడ్డారు. కానీ, ఓ ప్రజాప్రతినిధి ఫోన్ చేయడంతో ఆ కేసును నీరు గార్చారు. అదేవిధంగా నిజామాబాద్ నగరంలోని నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పోలీసులు రూ. లక్ష వరకు నగదును స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినా విషయం బయటకు రానివ్వలేదు. జక్రాన్ పల్లి మండలంలో వారం క్రితం పలువురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. చిన్నా, చితక జూదం కేసులకు ఉమ్మడి జిల్లాలో కొదవలేదు. ప్రజా ప్రతినిధుల పైరవీల కారణంగా చాలా కేసులు బయటకు రావడంలేదు.

జిల్లాలోని స్థావరాలు…

నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ పేస్-2, గాయత్రి నగర్, సాయినగర్, స్థానిక గంజ్ ప్రాంతంలోని ఒక మిల్, పలు అపార్ట్ మెంట్ లలో జోరుగా జూదం ఆడుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాలల్లో వ్యాపారులు, ఉద్యోగులు, రైతులు సైతం అడుతున్నారు. కామారెడ్డి పట్టణం అనగానే వ్యాపారాలకు పెట్టింది పేరు.. అంతేకాదు జూదం విషయంలో కూడా పెట్టింది పేరుగా నిలిచింది. ఇక్కడ జోరుగా జూదం ఆడుతారు. ఎడపల్లి మండలంలోని అటవీ శివారు గ్రామంలో నిత్యం లక్ష రూపాయల స్థాయిలో జూదం జరుగుతున్నట్లు సమాచారం. అదేవిధంగా ఇసుక క్వారీలతోపాటు పలు ప్రాంతాలను స్థావరాలను మార్చుకున్నారు. లాక్ డౌన్ కారణంగా పోలీసులు జూదంపై అంతగా దృష్టి సారించలేకపోతున్నారు. దీనిని అదునుగా తీసుకున్న కొందరు లక్షల రూపాయలను కేవలం నిర్వహణ ద్వారానే సంపాదిస్తున్నారు. కొంతమంది జూదం ఆడి ఇళ్లు, ఒళ్లు గుళ్ల చేస్తున్నారని వారి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చిన ఘటనలు ఉన్నాయంటేనే ఇక్కడ ఏ స్థాయిలో జూదం ఆడుతున్నారో ఇట్టే అర్థమవుతోన్నది.

Tags: Nizamabad, poker, money, police, corona


Next Story

Most Viewed