కరోనాపూట… వేటగాళ్ల వేట..

by  |
కరోనాపూట… వేటగాళ్ల వేట..
X

దిశ, వేములవాడ: ఒక పక్క మనుషులను కరోనా కాటు వేస్తుండగా, ఇంకో పక్క అడవి జంతువులను వేటగాళ్లు వేటాడుతున్నారు. అడవి జంతువులను చంపి మాంసాన్ని విక్రయిస్తున్నా, అటవీశాఖ అధికారులు మాత్రం చోద్యం చూసినట్టు చూస్తున్నారు. ఇలా నిత్యం వేట కొనసాగుతున్నా అధికారులు చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో అడవి జంతువులు అంతరించే ప్రమాదం నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో ఉదయం అడవి జంతువులు బలై పోయాయి.

గ్రామస్తుల కథనం ప్రకారం… కొంతమంది వేటగాళ్లు ధర్మారం పోతిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో ఉచ్చు బిగించడంతో అడవి పంది చిక్కుకుంది . దానిని తీసుకువచ్చి గ్రామ శివారులో గల చెరువు ప్రాంతంలో కోసి మాంసం కుప్పలుగా విక్రయించారు. మూడు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు కొండ గొర్రె చిక్కడంతో, దానిని కూడా కోసి మాంసం కుప్పలుగా వేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో మాంసం కుప్పల తో అక్కడి నుంచి పరారయ్యారు. ఇలా నిత్యం అడవి జంతువులు బలైపోతున్న, అటవీ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కాగా ఈ వేటగాళ్ల కొందరు కిందిస్థాయి సిబ్బంది సహకరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అడవి జంతువులను కాపాడేలా అటవీ అధికారులు చర్యలు గైకొనాలని గ్రామస్తులు కోరుతున్నారు.


Next Story

Most Viewed