మందులున్నా.. జాగ్రత్తలు పాటించాలి : మోడీ

by  |
మందులున్నా.. జాగ్రత్తలు పాటించాలి : మోడీ
X

న్యూఢిల్లీ : కరోనావైరస్‌కు టీకాలు వచ్చిన జాగ్రత్తలు పాటించడాన్ని మరువరాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొత్త సంవత్సరంలో ప్రజలకు పిలుపునిచ్చారు. ‘గతంలో కరోనాకు టీకా వచ్చే వరకు నిర్లక్ష్యం, అజాగ్రత్తలు వద్దని ఎప్పుడూ చెబుతుండేవాణ్ణి. కానీ, 2021 మంత్రం ఏంటంటే.. ‘మందులున్నాయి. జాగ్రత్తలూ ఉంటాయి.’ మందులతోపాటే జాగ్రత్తలూ పాటించడమే నూతన సంవత్సరంలో మనం పాటించాల్సిన మంత్రం. కరోనాకు చికిత్స, టీకాలతో కొత్త ఏడాది సరికొత్త ఆశలతో ఆహ్వానిస్తున్నది’ అని అన్నారు. గుజరాత్ రాజ్‌కోట్‌లో నిర్మించతలపెట్టిన ఎయిమ్స్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజలనుద్దేశిస్తూ మాట్లాడారు. ‘2020 సంవత్సరం ‘ఆరోగ్యమే మహా సంపద’ అనే పాఠాన్ని అందరికీ అర్థమయ్యేలా చేసింది. అనేక సవాళ్లను మనముందుంచింది. ఈ ఏడాది చివరి రోజున కరోనా యోధులను గుర్తుచేసుకోవడం సముచితం. కరోనా యోధులు వారి ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడారు. వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’ అని అన్నారు.

బృహత్కార్యానికి సిద్ధం..

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను భారత్ నిర్వహించనుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ బృహత్కార్యానికి సర్వం సంసిద్ధం చేస్తున్నామని వివరించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సహకరించినట్టుగానే టీకా కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కోరారు. దాదాపు కోటి మంది కరోనా నుంచి రికవరీ అయ్యారని, రోజువారీ కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. 2021 సంవత్సరం కొత్త ఆశలతో వస్తున్నదని తెలిపారు. ‘మన దేశంలో వదంతులు వేగంగా వ్యాపిస్తాయి. కొందరు స్వార్థపూరిత ప్రయోజనాల కోసం మరికొందరు బాధ్యతారాహిత్యంగా వదంతులు, అసత్యాలను ప్రచారం చేస్తుంటారు. కరోనా టీకా కార్యక్రమంపైనా అసత్య ప్రచారాలు, పుకార్లు రావచ్చు. కొందరు ఇప్పటికే మొదలుపెట్టారు కూడా. కాబట్టి, దేశ ప్రజలు వదంతులపట్లా జాగరూకతతో మెలగాలి. సోషల్ మీడియాలోనూ నిర్లక్ష్యంగా మెస్సేజీలు ఫార్వర్డ్ చేయరాదు. చెక్ చేసుకునే ఇతరులకు సందేశాలు పంపాలి. ఆరోగ్యపరంగా భారత్ పాత్రను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. ఇప్పటికే భారత్ ప్రపంచానికే కేంద్రంగా ఉన్నదని అన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed