పీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎంలు ఏమన్నరు.?

by  |
పీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎంలు ఏమన్నరు.?
X

న్యూఢిల్లీ: కరోనా తీవ్రత, లాక్‌డౌన్‌పై చర్చించేందుకు ప్రధాని మోడీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. 3గంటలపాటు జరిగిన ఈ సుదీర్ఘ సమావేశంలో మే 3 తర్వాత కరోనా తీవ్రత అంతగా లేని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారన్న విషయం మాత్రం స్పష్టమవుతోంది. ఈ సమావేశంలో 9 రాష్ట్రాల సీఎంలకు మాట్లాడే అవకాశం కల్పించగా, మిగతావారి సూచనలు, సలహాలను రాతపూర్వకంగా అందజేసే వెసులుబాటు కల్పించారు. మాట్లాడటానికి అవకాశం కల్పించిన వారిలో మేఘాలయ, మిజోరం, పుదుచ్చెరీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల సీఎంలు ఉన్నారు. వీరు ప్రధానితో ఏం మాట్లాడారన్న విషయాన్ని పరిశీలిస్తే..

మొదట మేఘాలయ సీఎం కొన్రాడ్ సంగ్మా మాట్లాడారు. తమ రాష్ట్రంలో మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్ కొనసాగించే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టం చేశారు. మెడికల్ ఎమర్జెన్సీ సేవలను కొనసాగించేందుకు రవాణాను అనుమతినిస్తామని తెలిపారు. అనంతరం పుదుచ్చెరీ సీఎం వి.నారాయణ స్వామి మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలోని వైద్యులకు పీపీఈ కిట్లు, ఇతర వైద్య పరికరాలను సమకూర్చాలని కోరారు. ఆర్థికంగా ఆదుకోవాలని తెలిపారు. అలాగే, మే 3 తర్వాత పరిశ్రమలను తెరిచేందుకు ఆసక్తి కనబర్చారు.

ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, దశలవారీగా వ్యాపార కార్యకలాపాలను ప్రారంభిస్తామని తెలిపారు. సాధారణ పరిస్థితి నెలకొనాలంటే ఆర్థిక పునరుజ్జీవం కీలకమని సూచించారు.

హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం థాకూర్ మాట్లాడుతూ.. ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించడానికి తమ రాష్ట్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అయితే, ఇతర రాష్ట్రాల పరిస్థితులను చూస్తే లాక్‌డౌన్‌ను కొనసాగించడమే మేలనే అభిప్రాయాన్ని వెలుబుచ్చారు.

బీహార్ సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం పోలియో క్యాంపెయిన్ మాదిరిగా ఇంటింటికీ తిరిగి, ఇప్పటివరకు 4కోట్ల మంది ప్రజలకు స్ర్కీనింగ్ టెస్టులు నిర్వహించిందని చెప్పారు. అలాగే, మే 3 వరకు లాక్‌డౌన్ కొనసాగిస్తామనీ, కేంద్రం మార్గదర్శకాలను పాటిస్తామని తెలిపారు.

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ కొనసాగింపునకే మొగ్గుచూపారు. అదేసమయంలో ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపాలకు అనుమతినివ్వాలని సూచించారు. అలాగే, మిగతా రాష్ట్రాల సీఎంలు కూడా ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మోడీ, సీఎంలతో పాటు అమిత్ షా కూడా పాల్గొన్నారు.

Tags: modi video conference, pm, modi, chief minister, lockdown, coronavirus, covid 19, states, nitish kumar, naveen patnaik,


Next Story

Most Viewed