ప్రజాస్వామ్యానికి వంశపాలన బద్ధశత్రువు: ప్రధాని

by  |
PM Modi
X

న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువు వంశపాలన అని, కుటుంబపాలనను కూకటివేళ్లతో పెకిలించివేయాల్సిన అవసరమున్నదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కేవలం ఇంటిపేరుతో ఎన్నికలు గెలిచే వారి విజయావకాశాలు క్రమంగా సన్నగిల్లుతున్నాయని తెలిపారు. నేషనల్ యూత్ పార్లమెంట్ వేడుకలో యువతను ఉద్దేశించి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వంశపారంపర్య పాలన రాజకీయాలను విషపూరితం చేస్తున్నాయని ఆరోపించారు.

వారికి దేశం కంటే కుటుంబ ప్రయోజనాలే ముఖ్యమని, రాజకీయాల్లో తమ కుటుంబం కొనసాగడమే వారి పరమలక్ష్యమని వివరించారు. వీరి ఆటలను కట్టిపెట్టాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని, ఇతర రంగాల్లో యువత ఉత్తేజం, ఉత్సాహం, శక్తి సామర్థ్యాలు అవసరమున్నట్టే రాజకీయాల్లోనూ వారి అవసరమున్నదని తెలిపారు. ఒకప్పుడు రాజకీయాలు ఎప్పటికి మారవనే ఆలోచనా ధోరణి ప్రజల్లో ఉండేదని, కానీ, నేడు నిజాయితీగా పనిచేస్తున్న రాజకీయ నాయకులను ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. అందుకే కుటుంబపాలన చేస్తున్నవారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. జయంతి సందర్భంగా స్వామి వివేకానందకు ఆయన నివాళులర్పించారు.


Next Story

Most Viewed