ఆ రంగంలోని పీఎల్ఐ పథకానికి 33 కంపెనీలకు ఆమోదం..

by  |
technology
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం రంగం, నెట్‌వర్కింగ్ పరికరాల ప్రోత్సాహానికి కేంద్రం ప్రకటించిన ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకంలో భాగంగా 33 కంపెనీల దరఖాస్తులను ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉందని తెలుస్తోంది. టెలికాం పరికరాల స్థానిక ఉత్పత్తిని పెంచడం, దిగుమతులను తగ్గించుకోవడం, దేశీయంగా తయారీ కంపెనీలకు ప్రోత్సాహాన్ని అందించేందుకు కేంద్రం రూ. 12,195 కోట్లను వెల్లడించింది. దీనిద్వారా ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ నిలుస్తుందని కేంద్రం ఆశిస్తోంది. అలాగే, ఈ పథకం ద్వారా నెట్‌వర్క్ పరికరాలు, రూటర్లు, బ్రాడ్‌బ్యాండ్ ట్రాన్స్‌మిషన్ పరికరాలు, 5జీ పరికరాలు, ఆప్టికల్ ఫైబర్ ఆధారిత కనెక్షన్లను అందించేందుకు కావాల్సిన ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీకి వీలవుతుంది. కాగా, ఈ పథకం కోసం మొత్తం 36 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి.

వీటిలో 33 కంపెనీలు ఎంపిక కానున్నాయని సమాచారం. మిగిలిన మూడు సంస్థలు సాంకేతిక కారణాలతో తిరస్కరించబడ్డాయి. వీటిలో స్టెరిలైట్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, కెన్‌స్టెల్ నెట్‌వర్క్ సంస్థల దరఖాస్తులు ఆమోదించబడలేదు. కాగా, టెలికాం రంగానికి పీఎల్ఐ పథకం ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌లో అమలు చేశారు. దీని ద్వారా ఆమోదం లభించిన సంస్థలు 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు సంస్థలు లబ్ది పొందనున్నాయి.



Next Story

Most Viewed