దండకారణ్యంలో పీఎల్‌జీఏ వారోత్సవాలు

by  |
దండకారణ్యంలో పీఎల్‌జీఏ వారోత్సవాలు
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టు అనుబంధ పీఎల్‌జీఏ 20వ వార్షికోత్సవ వారోత్సవాలు బుధవారం ప్రారంభమైనట్లు తెలుస్తోంది.‌ దట్టమైన అరణ్యంలో జరిగిన వార్షికోత్సవ ప్రారంభ సభకు భారీ సంఖ్యలో ఆదివాసీలు హాజరైనట్టు సమాచారం.‌‌ వార్షికోత్సవ సభ ప్రారంభ చిత్రాలు, వీడియోలను మావోయిస్టులు వ్యూహాత్మకంగా మీడియాకు విడుదల చేసినట్లు భావిస్తున్నారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి జగన్, ఆజాద్‌లతోపాటు మావోయిస్టు అగ్రనేతలు పలువురు పీఎల్‌జీఏ వార్షికోత్సవ ప్రారంభ సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. ఇటీవల అమరుడైన ‌మావోయిస్టు పార్టీ అగ్రనేత రామన్నసహా పలువురు అమరవీరులను వార్షికోత్సవాల తొలిరోజున పతాకావిష్కరణల సందర్భంగా విప్లవ జోహార్లతో స్మరించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా వార్షికోత్సవ సందేశాన్ని బీకేటీజే కార్యదర్శి ఆజాద్ ప్రకటన రూపంలో మీడియాకు విడుదల చేశారు. అమరుల కలలను సాకారం చేసేందుకే పీఎల్‌జీఏ నిర్మాణమైందని ఆజాద్ పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలను అణిచి వేయడానికి పాలక ప్రభుత్వాలు ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నాయని చెప్పారు. సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వాలు తమ ఫాసిస్టు చర్యలతో అణచి వేస్తున్నాయని విమర్శించారు. దోపిడి పాలనకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆజాద్ కోరారు. అందుకోసం పీఎల్‌జీఏలో చేరాలని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed