మట్టిలో ఆట.. మంచిదేగా!

by  |
మట్టిలో ఆట.. మంచిదేగా!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఒకప్పుడు గ్రౌండ్‌లో ఆడుకోవాలంటే.. స్థలం దొరికేది కాదు. కానీ ఇప్పుడు గ్రౌండ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈతరం పిల్లలంతా క్లాసులతో కుస్తీ పడుతూ, మొబైల్స్‌లో గేమ్స్ ఆడుతూ కాలం గడిపేస్తున్నారు. అంతేకాదు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని మట్టిలో ఆడేందుకు ఇష్టపడటం లేదు. అయితే, ప్రకృతి ఒడిలో మట్టిలో ఆడే పిల్లలో త్వరగా వ్యాధి నిరోధకత శక్తి పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు కాంక్రీట్‌తో కూడిన ప్లేగ్రౌండ్‌ల కన్నా మట్టితో కూడిన ఆట స్థలాల్లో ఆడటం వల్ల బాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుంచి చర్మం తట్టుకోనేంత స్థాయిలో ఇమ్యూనిటీని పెరుగుతుందని కొత్త అధ్యయనం చెబుతోంది.

ఓ వైపు.. చిన్నారులంతా మొబైల్ గేమ్స్‌, సోషల్ మీడియాలకు అడిక్ట్ అయిపోయి గ్రౌండ్‌లో ఆడటం మానేశారు. మరోవైపు ఊర్లు, పట్టణాలన్నీ కాంక్రీట్ జంగల్స్‌గా మారిపోతున్నాయి. ఇక గ్రౌండ్ లేని స్కూళ్లకైతే లెక్కే లేదు. పిట్ట గూళ్లలాంటి బిల్డింగ్స్‌లో పాఠశాలలు రన్ చేస్తున్నారు. దీంతో చిన్నారులకు ఇటు ఇంటి దగ్గర, అటు స్కూళ్లలోనూ ఆడుకోవడానికి స్థలం దొరకడం లేదు. అయితే మట్టిలో ఆడితే పిల్లల్లో గట్ బ్యాక్టీరియాను ఎదుర్కొనే శక్తి వస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. బహిరంగ ఆటస్థలాల్లో, మట్టి ప్రదేశాల్లో ఎక్కువ సమయం ఆడుకునే పిల్లలు ఎక్కువ ఆరోగ్యకరంగా ఉంటారని ఫిన్‌లాండ్‌కు చెందిన హెల్సింకి విశ్వవిద్యాలయ పరిశోధక బృందం వెల్లడించింది.

ఫిన్‌లాండ్‌లోని పలు నగరాల్లో పది డే-కేర్ సెంటర్లకు చెందిన 3- 5 ఏళ్లలోపు గల 75 మంది చిన్నారులపై రీసెర్చర్లు అధ్యయనం చేశారు. ఇందుకోసం నాలుగు డే-కేర్ సెంటర్లలోని కాంక్రీట్ ప్లే గ్రౌండ్లను మట్టితో కూడిన గడ్డి మైదానాలుగా మార్చారు. మూడు డే-కేర్ సెంటర్లను మట్టి మైదానాలుగా మార్చారు. మరో మూడు సెంటర్లలో మాత్రం పాత కాంక్రీట్ ఆట స్థలాన్ని అలానే ఉంచారు. ఒక నెల తరువాత పరిశోధకుల బృందం.. ఆయా పిల్లలందరి చర్మం, రక్తం, మలవిసర్జన నమూనాలను సేకరించారు. ఆ అధ్యయనంలో మట్టి మైదానాల్లో ఆడిన పిల్లల్లో ఆరోగ్యపరంగా త్వరితగిన మార్పులను చూశారు. వారి రోగనిరోధక శక్తి కేవలం నెల్ల రోజుల్లోనే పెరగడం విశేషం. వారి రక్తంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ప్రొ-ఇన్‌ఫ్లమేటరీ ప్రొటీన్స్ నిష్పత్తిలో పెరుగదల కనిపించినట్లు తేలింది.



Next Story

Most Viewed