ఆ రైలొస్తే విమానాలు బందే..!

by  |
ఆ రైలొస్తే విమానాలు బందే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : భారతీయ రైల్వే శాఖ కొత్తపుంతలు తొక్కుతోంది. ఊడిపోయిన కిటికీలు, తుప్పుపట్టిన తలుపులు, కంపు కొట్టే టాయ్ లెట్లకు స్వప్తి చెబుతూ.. అధునాతన సౌకర్యాలకు నాంది పలుకుతోంది. ట్రైన్‌లో ప్రయాణించినా.. ఫ్లైట్‌లో వెళ్లిన అనుభూతి కలిగేలా సౌకర్యాలు కల్పిస్తోంది. అదిరిపోయే హైటెక్ హంగులతో రైల్వే ప్రయాణికులు ఔరా.. అనేలా మురిపిస్తోంది.

భారతీయ రైల్వే శాఖ నూతనంగా ‘విస్టాడోమ్’టూరిస్టూ కోచ్‌లను ప్రవేశపెట్టనుంది. 180 కిలో మీటర్ల వేగాన్ని తట్టుకునేలా రూపొందించిన ఈ కోచ్‌ల ట్రయల్ రన్ బుధవారం విజయవంతమైంది. దీనిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి షీయూష్ గోయల్ ట్విట్టర్ వేదికగా ‘విస్టాడోమ్’ విశేషాలను పంచుకున్నారు. దానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ‘ఈ కొత్త కోచ్‌లు ప్రయాణికులకు ప్రయాణాన్ని కేవలం జర్నీలా కాకుండా మరిచిపోలేని ఒక మరుపురాని జ్ఞాప‌కంగా మార్చనున్నాయి. భారత రైల్వే ప్రవేశపెట్టనున్న కొత్త కోచ్‌లను ఓసారి చూడండి’ అంటూ క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. కాగా ఈ కొత్త కోచ్‌లను ప్రస్తుతం దాద‌ర్‌-మ‌డ‌గావ్‌, అర‌కు లోయ‌, క‌శ్మీర్ లోయ‌, డార్జిలింగ్ హిమాల‌య‌న్ రైల్వే, క‌ల్కా షిమ్లా రైల్వే, కంగ్రా వ్యాలీ రైల్వే, మాథేర‌న్ హిల్ రైల్వే, నీల‌గిరి మౌంటేన్ ప్రాంతాల్లో మాత్రమే న‌డ‌ప‌నున్నారు.

‘విస్టాడోమ్’కోచ్‌లు సర్వాంగ సుందరంగా కనిపిస్తున్నాయి. పూర్తిగా ఎయిర్ కండీషన్‌తో ఉన్న ఈ బోగీల్లో భారీ విండోస్ ఉన్నాయి. 180 డిగ్రీల్లో తిరిగే లగ్జరీ సీట్లను అమర్చారు. వాటిల్లో కూర్చొని విండోస్ నుంచి బయటకు చూస్తే.. ప్రకృతితో కలిసి ప్రయాణించిన అనుభూతి కలగక మానదు. ఒక్కొ కోచ్‌లో 44 సీట్లను అమర్చారు. అలాగే ట్రైన్ వెళ్లే రూట్‌కు సంబంధించిన లొకేషన్‌ను ఈ కోచ్‌లలో రియల్ టైమ్‌లో చూడొచ్చు. టాయ్‌లెట్స్‌ను కూడా ఆధునిక టెక్నాలజీతో రూపొందించారు. ఇలాంటి రైళ్లు దేశం మొత్తం ప్రవేశపెడితే.. దేశీయంగా విమాన సర్వీసులన్నీ మూత పడక తప్పదేమో..!



Next Story

Most Viewed