నారాయణపేట గోల్డ్‌కు అంతర్జాతీయ గుర్తింపు కోసం చర్యలు : జయేష్ రంజన్

by  |
నారాయణపేట గోల్డ్‌కు అంతర్జాతీయ గుర్తింపు కోసం చర్యలు : జయేష్ రంజన్
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : నారాయణపేట జిల్లా బంగారానికి దేశంలో మంచి గుర్తింపు ఉంది. ఆధునిక యంత్రాల సహాయంతో కళాత్మకమైన రీతిలో ఆభరణాలను తయారు చేసి జాతీయ స్థాయిలోనే కాకుండా ‘పేట’కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ చెప్పారు.

గురువారం నారాయణపేట జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు జయేష్ రంజన్ వచ్చారు. ఈ క్రమంలో కలెక్టరేట్‌లో ఎంపీ మన్యం శ్రీనివాస్ రెడ్డి, స్థానిక శాసనసభ్యుడు ఎస్. రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరిచందనతో కలిసి స్థానిక బంగారు వ్యాపారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారం వ్యాపారంలో ప్రసిద్ధి చెందిన నారాయణపేటకు మరింత పేరును తీసుకురావడానికి వీలుగా ఇక్కడ ఉన్న పరిస్థితులు, బంగారు వ్యాపారం, నగల తయారీ తదితర అంశాలను గురించి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు వివరించారు.

బంగారు వ్యాపారానికి మరిన్ని మెరుగులు అద్దెందుకు, వ్యాపారుల సమస్యలను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలను గురించి వివరించారు. ఇందులో భాగంగానే ఆభరణాల తయారీదారులు, వ్యాపారులు, ప్రజల ఆదరణను దృష్టిలో ఉంచుకొని నారాయణపేట జిల్లా కేంద్రంలో సమీకృత భవన సముదాయాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేసి బంగారు ఆభరణాల తయారీదారులకు శిక్షణను ఇచ్చి కళాత్మకమైన ఆభరణాలు తయారుచేసి అంతర్జాతీయ మార్కెట్‌కు ధీటుగా నిలిచేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.

మూడు ఎకరాల స్థలంలో మౌళిక సదుపాయాల ఏర్పాటు విషయమై ఆర్కిటెక్చర్‌ను పంపనున్నట్టు తెలిపారు. దీంతోపాటు ప్రపంచ ప్రసిద్ధి చెందిన దుబాయ్, కేరళలోని మలబార్ గోల్డ్ లాంటి సంస్థలను సందర్శించి అధ్యయనం చేయనున్నట్టు జయేష్ రంజన్ వెల్లడించారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. చేనేత, బంగారు వ్యాపారంలో ప్రసిద్ధి చెందిన నారాయణపేట జిల్లాను మరింత అభివృద్ధిపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చేనేత రంగానికి సంబంధించి ఇప్పటికే పది కోట్ల రూపాయల అంచనాలతో బిల్డింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ సహకారంతో మూడు ఎకరాల స్థలంలో గోల్డ్ సోక్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story

Most Viewed