‘కాంగ్రెస్ బిక్షతో గెలిచిన ఎమ్మెల్యే రేగా.. హైదరాబాద్‌లో టైంపాస్ చేస్తున్నారా ?’

by  |
‘కాంగ్రెస్ బిక్షతో గెలిచిన ఎమ్మెల్యే రేగా.. హైదరాబాద్‌లో టైంపాస్ చేస్తున్నారా ?’
X

దిశ, మణుగూరు : పినపాక నియోజకవర్గ ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు హైదరాబాద్‌కే పరిమితం అయ్యాడని పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షుడు కొర్స ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మణుగూరు మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ మండల అధ్యక్షుడు ఎండి.రషీద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. కాంగ్రెస్ పార్టీ బిక్షతో గెలిచిన ఎమ్మెల్యే రేగా నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్ఎస్‌లోకి వెళ్తున్నానని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి హైదరాబాద్‌లో టైం పాస్ చేస్తుతున్నారని మండిపడ్డారు. ఇదేనా నియోజకవర్గ అభివృద్ధి అని పార్టీ కార్యాలయంలో నిలదీశారు. ఓ పక్క ప్రజలు విషజ్వరాలతో పిట్టల్లా రాలిపోతుంటే కొంచెం కూడా కనికరం లేదా అని మండిపడ్డారు. విష జ్వరాలతో రోజుకి ఒకరు మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే రేగా కాంతారావు లాగానే వైద్యాధికారులు కూడా టై పాస్ చేస్తున్నారని, ప్రజల ఆరోగ్య సమస్యలను పట్టించుకోవడంలేదన్నారు. ఆరోగ్య సమస్యలపై జిల్లా వైద్యాధికారులు అక్కడక్కడ ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా నిర్వహించి ప్రచారానికి మాత్రమే పరిమితమౌతున్నారని విమర్శించారు. విష జ్వరాలతో చిన్న పిల్లలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా ప్రజలు అనారోగ్యాలతో కొట్టు మిట్టాడుతుంటే ప్రయివేట్ ఆసుపత్రిలు ఇదే అదునుగా చేసుకొని టెస్ట్‌ల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. అసలు నియోజకవర్గంలో డెంగ్యూ టెస్ట్ లేకపోయినా కొన్ని ఆసుప్రతులు డెంగ్యూ టెస్ట్ పేరుతో ప్రజల నడ్డి విరిస్తున్నారని తెలిపారు. అలాంటి ప్రయివేట్ అసుప్రతులపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా ఎమ్మెల్యే రేగా ప్రజల సమస్యలను పట్టించుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. అలాగే వైద్యాధికారులు గ్రామాలలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని వైద్యులను కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మహిళ నాయకురాలు షభానా, టౌన్ అధ్యక్షురాలు సౌజన్య, ఎస్టీ సెల్ అధ్యక్షుడు కొమరం రామ్ మూర్తి, మణుగూరు మండలం మైనారిటీ అధ్యక్షుడు అలీ, సోషల్ మీడియా ఇంచార్జ్ అచ్చ నవీన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


Next Story