పినపాక రైతుల భూములు కబ్జా.. స్థానిక ఎమ్మెల్యే హస్తం..?

by  |
పినపాక రైతుల భూములు కబ్జా.. స్థానిక ఎమ్మెల్యే హస్తం..?
X

దిశ,మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం కొత్తగూడెం ప్రాంతంలోని వీరాపురం భీమవరం గ్రామాలలో స్థానిక జడ్పీటీసీ భర్త దాట్ల వాసుబాబు ఆ గ్రామాల రైతులను బెదిరించి అక్రమంగా ఇసుకను జేసీబీలతో డంపు చేసి శుక్రవారం మధ్యాహ్నం లారీల ద్వారా తరలిస్తుంటే మా ఊరు గ్రామ ప్రజలు లారీలను అడ్డుకున్నారు. దాట్ల వాసు బాబు స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావుతో చేతులు కలిపి ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారని గ్రామంలోని రైతులు చెబుతున్నారు. వాసుబాబు దినసరపు శోభారాణి అనే రైతు కుటుంబం దగ్గర నుంచి 45 నుంచి 50 ఎకరాల పొలాలను కబ్జా చేసి, రైతులను మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులు గురిచేస్తున్నాడని గ్రామస్తులు వాపోతున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావుతో చెప్పి ఏదో ఒక విధంగా రైతుల మీద కేసులు నమోదు చేస్తున్నాడని పలువురు మండిపడుతున్నారు. ప్రశ్నించిన ఇద్దరు రైతులను వాసుబాబు స్థానిక ఎమ్మెల్యేతో సాయంతో టీ-కొత్తగూడెం గ్రామంలోని ఇద్దరూ రైతులను పోలీసులకు చెప్పి అరెస్టు చేయించి తీసుకెళ్లారని స్థానికులు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇసుక మాఫియా, భూకబ్జా మాఫియాకు తొత్తుగా పని చేస్తున్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తవ్వకాలకు అనుమతులు లేకపోయినా రాత్రంతా దొంగతనంగా ఇసుకను డంప్ చేసి లారీల ద్వారా తరలిస్తూ రూ.కోట్లు సొమ్ము చేసుకుంటున్నారని గ్రామ రైతుల ద్వారా తేటతెల్లమైంది.

వీరాపురంలో వీరంగం.. భీమవరంలో బీభత్సం..

దాట్ల వాసుబాబుకి వీరాపురంలో ఇసుక ర్యాంపుకు పర్మిషన్ ఉంది కానీ, వీరాపురంలో ఉన్న ఇసుకను తవ్వకుండా భీమవరం రైతుల పొలంలో ఉన్న ఇసుకను అక్రమంగా తీస్తున్నాడని రైతులు మండిపడ్డారు. భీమవరంలో ఉన్న భూములకు పట్ట పాసు బుక్కులు, పహానీలు ఉన్నాయని రైతులకు చెబుతున్నారు. కానీ స్థానిక రెవెన్యూ కార్యాలయంలో రైతుల భూముల సర్వే నెంబర్ల భూ రికార్డులను సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వరరావు మాయం చేసి, భీమవరంలోని భూములను ప్రభుత్వ భూములగా చిత్రీకరించి దాట్ల వాసుబాబుతో ఇసుక తవ్వకాలకు బేరం కుదుర్చుకోని అక్రమాలకు పాల్పడుతున్నారని గ్రామ రైతులు చెబుతున్నారు. రాజేశ్వరరావును రైతులు వెళ్లి భూముల గురించి అడగగా మీకు భూములు లేవు, ఏమీ లేవు? అని సమాధానం చెప్పాడు. స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు నా బావ అని చెప్పి రైతులను భయానికి గురి చేస్తూ రైతుల భూములను దాట్ల వాసుబాబు, రాజేశ్వరరావు ఇద్దరు కలిసి కబ్జా చేశారని రైతులు విలిపిస్తున్నారు. 1950 నుండి 1990 మధ్య ఉన్న భూ రికార్డులలో దాదాపుగా దినసరపు శోభారాణి కుటుంబానికి 45 ఎకరాలు ఉన్నాయి. అన్నదమ్ముల వాటాలో ఉన్న ఇసుక భూములను వారి నుండి ఎలాంటి అనుమతులు లేకుండానే దాట్ల వాసుబాబు ఇసుక తవ్వకాలు జరిపి ఎలా డంపులు చేశారని గ్రామస్తులు ప్రశ్నించారు. వాసుబాబు, రాజేశ్వరరావు ఇద్దరు స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు అండదండలతో రైతుల భూములను కబ్జా, ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారని గ్రామ ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు.

పినపాక తహసీల్దార్ ఆఫీసులో చక్రం తిప్పుతున్న రాజేశ్వరరావు..

స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు నా బావ అని చెప్పుకుంటూ భూముల కబ్జాకు పాల్పడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పినపాక గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో పెద్ద అవినీతి పరుడు రాజేశ్వరరావు అని పినపాక మండల ప్రజలు మాట్లడుతున్నారు. గతంలో ఇతను 14 మంది రైతుల నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 80,000 లంచం తీసుకుని పట్టా పాస్ బుక్కులు చేశారని రైతులు చెపుతున్నారు. ఇంత అవినీతిపరుడు వెనుక స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఉన్నాడని మండల ప్రజలు అంటున్నారు. దాదాపు రూ.10 నుంచి 15 కోట్లు సంపాదించాడని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. మణుగూరు, ఖమ్మం, హైదరాబాద్‌లో ఆస్తులు కూడబెట్టాడని ప్రజలు తెలుపుతున్నారు. రాజేశ్వరరావును ఎమ్మెల్యే రేగా కాంతారావు నిత్యం కాపాడుతున్నారని ప్రజల ద్వారా తేటతెల్లమైంది. ఇలాంటి ఎమ్మెల్యే ఉన్నందుకు పినపాక నియోజకవర్గం ప్రజలు ఛీ-కొడుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇసుక మాఫియా, భూ కబ్జాలపై ఎమ్మెల్యే రేగా కాంతారావు హస్తం..

పినపాక నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక మాఫియా, భూ కబ్జాలో ఎమ్మెల్యే రేగా కాంతారావు హస్తం ఉందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే రేగా కాంతారావు తన అనుచరులతో కలిసి భూకబ్జాలకు పాల్పడుతున్నారనే వాదన బలంగానే వినిపిస్తోంది. నియోజకవర్గ ప్రజలకు తూతూ మంత్రంగా పని చేస్తున్నాడని, ప్రజలకు ఏ విధంగా సాయం చేయడం లేదని సమాచారం. ఎవరైనా ఎదురు తిరిగితే స్థానిక పోలీసులతో కలిసి కేసులు పెట్టించి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాడని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇసుక ర్యాంపు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ కట్టల్లో రేగాకు 50% వాటా ఉన్నదని, ఎవరైనా రేగాకు సహకరించకపోతే మానసికంగా దెబ్బ తీస్తున్నాడని ప్రజలు అంటున్నారు. ఎమ్మెల్యే ఇలా చేస్తే ప్రజల బాధలను తీర్చేది ఎవరని నియోజకవర్గ ప్రజలు ఆలోచనలో పడ్డారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కాంతారావు తన తీరు మార్చుకొని ప్రజల కోసం పనిచేయాలని పలువురు నాయకులు కోరుతున్నారు.


Next Story

Most Viewed