సింగరేణి కార్మికులే వీరి టార్గెట్.. లోన్ల పేరుతో దందా

by  |
సింగరేణి కార్మికులే వీరి టార్గెట్.. లోన్ల పేరుతో దందా
X

దిశ, గోదావరి ఖని: సింగరేణి కార్మికులను టార్గెట్ గా చేసుకొని, కొంతమందిని కోవర్టుగా మార్చుకుని వారి వద్ద సీక్రెట్ గా కార్మికుల ఫోన్ నెంబర్లను సేకరించి హలో సార్…లోన్ ఇస్తాం తీసుకుంటారా…? అంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. రోజుకు పదుల సంఖ్యలో పలువురు కార్మికులకు ఫోన్లు చేసి లోన్ తీసుకుంటారా? అంటూ సతాయిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయకాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండానే కొంతమంది తమకంటూ ప్రత్యేక ఆఫీసును ఏర్పాటు చేసుకుని యువతులతో టెలీకాలింగ్ ను నిర్వహిస్తున్నారు. సదరు నిర్వాహకులు మధ్యవర్తుల ద్వారా సింగరేణి కార్మికుల ఫోన్ నెంబర్లను సేకరించి ప్రతిరోజు ఫోన్లు చేస్తూ లోన్ ఇస్తామని, తాము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని చెబుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు కార్మికులు పేర్కొంటున్నారు. తాము బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నామని, తమ బ్యాంకులో ఎంత కావాలన్నా లోన్ ఇస్తామని చెబుతూ కార్మికులను అయోమయానికి గురి చేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే ప్రత్యేకంగా ఆఫీసులను ఏర్పాటు చేసుకొని బ్యాంకుల పేరుతో నిత్యం ఫోన్లు చేస్తూ అనుమతి లేని టెలీకాలింగ్ ను నిర్వహిస్తున్నా సంబంధిత శాఖ అధికారులు కానీ, బ్యాంకుల పేరుతో ఫోన్లు చేస్తున్న సంబంధిత బ్యాంకు అధికారులు కానీ పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

కొంత మంది ప్రైవేట్ ఏజెన్సీల పేరుతో బ్యాంకు లోన్ ఇప్పిస్తామంటూ కార్మికులను గందరగోళానికి గురి చేస్తున్నారు. మార్కండేయ కాలనీలో ఇప్పటికే మూడు ప్రైవేట్ ఏజెన్సీలు బ్యాంకుల పేరుతో టెలీకాలింగ్ వ్యవస్థను నిర్వహిస్తున్నా.. సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించడం లేదు. గతంలో సైతం ఇలాగే కళ్యాణ్ నగర్ లో గుట్టుచప్పుడు కాకుండా టెలీకాలింగ్ ను నిర్వహిస్తూ కార్మికులకు ఫోన్లు చేసి లోన్ ఇస్తామని ఆఫీసుకు పిలిపించుకొని కార్మికులను ఇబ్బందులకు గురి చేశారు. కొంతమంది ఆఫీసులో ఆందోళన చేయడంతో అసలు విషయం బయటకు పొక్కడంతో ఆయా ఆఫీస్ నిర్వాహకులు తమ కార్యాలయానికి తాళం వేసుకున్న సంఘటన సైతం చోటు చేసుకుంది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకొని అనుమతి లేని టెలీ కాలింగ్ పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


Next Story

Most Viewed