పిల్లలపై పీఈటీ టీచర్ పైశాచికత్వం..

by  |
పిల్లలపై పీఈటీ టీచర్ పైశాచికత్వం..
X

దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సప్తగిరి కాలనీలోని మహాత్మా జ్యోతి బాపూలే తెలంగాణ బ్యాక్వర్డ్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న అధ్యాపకుడు కొంతమంది విద్యార్థులను చితకబాదాడు. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్న చిన్న కారణాలను అడ్డం పెట్టుకుని నిత్యం విద్యార్థులను చితకబాదుతున్నాడనే విమర్శలు ఆయనపై వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా విద్యార్థులను చేతి వేళ్ళు, భుజంపై కొడుతూ ఉండటంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పీఈటీని సస్పెండ్ చేయాలి :

అన్యాయంగా విద్యార్థులపై చేయి వేసిన పీఈటీ సార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు రేణుకుంట్ల ప్రీతం డిమాండ్ చేశారు.రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని సప్తగిరి కాలనీలోని మహాత్మా జ్యోతి బాపూలే తెలంగాణ బ్యాక్వర్డ్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలోని పీఈటీ సార్ ఎలాంటి కారణాలు లేకుండా విద్యార్థులను ఇష్టానుసారంగా దద్దుర్లు వచ్చేలా కొట్టడం, పిడికిలితో వీపులో గుద్దడం వంటి చర్యల వలన విద్యార్థులు నడుము నొప్పితో బాధపడుతున్నారని తెలిపారు. చేతివేళ్ళపై కొట్టడం ద్వారా బుక్స్ రాసుకో లేకపోతున్నారని, అలాంటి పీఈటీని వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కూడా ఎలాంటి కారణాలు లేకుండానే విద్యార్థులను కొట్టడం జరిగిందని, కావున తక్షణమే సంబంధిత అధికారులు, ప్రధాన ఉపాధ్యాయుడు పీఈటీని విధుల నుండి తొలగించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ఉద్యమం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో శనిగరపు చంద్రశేఖర్, మాతంగి సాగర్, విద్యార్థుల తల్లిదండ్రులు రవికుమార్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

– ఏఐఎస్ఎఫ్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు రేణుకుంట్ల ప్రీతం



Next Story

Most Viewed