గాల్లో పైకెగిరి వంతెనపై నుంచి పడిన ఇద్దరు..!

by  |
గాల్లో పైకెగిరి వంతెనపై నుంచి పడిన ఇద్దరు..!
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో నిన్న రాత్రిఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్బీనగర్ వంతెనపై వెళ్తున్న బైకును వెనుకనుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఓ యువకుడు అమాంతం ఎగిరి ఫ్లైఓవర్‌ మీద నుంచి కిందపడిపోవడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మరల అదే కారు ఇంకో బైక్‌ను సైతం ఢీకొట్టింది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయాలపాలై స్థానిక మెడిసిస్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

వివరాల్లోకివెళితే.. బాలానగర్‌ సమీపంలోని ఫతేనగర్‌కు చెందిన ఉదయ్‌రాజ్‌(18) డిగ్రీ లాస్ట్ ఇయర్ చదువుతున్న మేనమామ అన్న కుమార్తె అనుష(20)ను మంగళవారం పరీక్షా కేంద్రానికి బైక్ పై తీసుకొచ్చాడు. అనంతరం ఇద్దరు సంఘీ ఆలయానికి బయల్దేరారు. ఎల్బీనగర్‌ ఫ్లై ఓవర్‌పైకి చేరుకోగానే వెనుకనుంచి అతి వేగంగా వచ్చిన ఓ కారు వీరిని ఢీకొట్టింది. దీంతో ఉదయ్‌రాజ్‌ అమాంతం గాల్లోకి ఎగిరి వంతెన పైనుంచి 20 అడుగుల కిందనున్న రోడ్డుపై పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనూష తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన ఆ కారు మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో సైదాబాద్‌కు చెందిన బీటెక్‌ విద్యార్థిని సాయిప్రియ(20), బానోత్‌ నగేష్‌(17) తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని ఎల్బీనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. రెండు ప్రమాదాలకు కారణం అవడమే కాకుండా, ఓ ప్రాణం బలిగొన్న కారు డ్రైవర్‌ను ఎల్బీనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Next Story

Most Viewed