ప్రచార ప్రకటనలకు అనుమతి తప్పనిసరి

by  |
ప్రచార ప్రకటనలకు అనుమతి తప్పనిసరి
X

దిశ, సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నికలో నిర్వహించే ప్రచార కార్యక్రమాలకు సంబంధించి మీడియాలో ప్రసారం చేసే వీడియో అడ్వటైజ్‌మెంట్లకు అనుమతులకు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకట్రామరెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో వీడియో విజువల్ ప్రదర్శనకు ముందస్తుగా జిల్లా మీడియా సర్టిఫికేట్ అండ్ మానిటరింగ్ కమిటీ నుంచి అనుమతులు తప్పనిసరి అని సూచించారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఒక ప్రకటన జారీ చేశారు.

పలు వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే పెయిడ్‌ న్యూస్ గుర్తింపునకు ఎంసీఎంసీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కమిటీ ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో ప్రసారమయ్యే కథనాలను పరిశీలించి అతిక్రమణలు జరిగితే తగు చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. అదేవిధంగా పోలింగ్ రోజు, ముందు రోజు ప్రచురితమయ్యే ప్రింట్ మీడియా ప్రకటనలకు కూడా అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి పోటీచేసే అభ్యర్థులకు మాత్రమే జిల్లా ఎంసీఎంసీ కమిటీ ద్వారా రాజకీయ ప్రచార ప్రకటనలకు అనుమతి ఉంటుందని.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రిజిస్ట్రర్ అయిన పార్టీల ప్రకటనలకు సంబంధించి రాష్ట్రస్థాయి ఎంసీఎంసీ కమిటికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వెంకట్రామరెడ్డి తెలియజేశారు.

జిల్లా మీడియా సర్టిఫికేట్ అండ్ మానిటరింగ్ కమిటీ నుంచి అనుమతులు లేని రాజకీయ ప్రకటనలను కేబుల్, శాటిలైట్, ఇతర చానెల్స్ ద్వారా ప్రచారం చేయవద్దని జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు లేని రాజకీయ ప్రకటనలు ప్రసారం చేసే ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, రాజకీయ పార్టీ అభ్యర్తులపై ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



Next Story

Most Viewed