మునుగోడు సభకు హైదరాబాద్ జనం.. 2 వేల కార్లతో భారీ కాన్వాయ్!!

by Disha Web Desk 2 |
మునుగోడు సభకు హైదరాబాద్ జనం.. 2 వేల కార్లతో భారీ కాన్వాయ్!!
X

మునుగోడులో శనివారం సీఎం కేసీఆర్ నిర్వహించే ప్రజాదీవెన సభకు హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్థానిక ప్రజలు ఆశించినంతగా రాకపోవచ్చని భావిస్తున్న టీఆర్ఎస్ నాయకత్వం ఇలా ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. శనివారం ఉదయం పెద్ద అంబర్ పేట నుంచి రెండు వేల కార్ల కాన్వాయ్ మునుగోడుకు బయల్దేరనుంది. కార్లు, జనసమీకరణ బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారు. ప్రతికారుకూ సదరు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండాలని పార్టీ అధినాయకత్వం సూచించింది. ఈ మేరకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే 300 కార్లను తరలించనున్నారని తెలిసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడులో సీఎం కేసీఆర్ ప్రజాదీవెన సభకు టీఆర్ఎస్ హైదరాబాద్ నుంచి జనాన్ని తరలించనున్నది. అక్కడ జనంపై ఫోకస్ పెట్టని టీఆర్ఎస్ ఇక్కడి నుంచి తరలించడంపై ప్రధానంగా దృష్టి పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే రెండువేల కార్లతో భారీగా జనంను తరలిస్తున్నారు. మునుగోడు సభలో బలప్రదర్శనే లక్ష్యంగా టీఆర్ఎస్ ఫోకస్ పెట్టి అందుకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి కూడా జనాన్ని తరలించేలా ప్లాన్ చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని ప్రతిమండలం నుంచి 20వేల మందిని తరలించాలని స్థానిక నేతలకు పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సభను సక్సెస్ చేసి టీఆర్ఎస్ సత్తాచాటాలని భావిస్తున్నారు. మొత్తంగా సభకు లక్షన్నరమందిని తరలించేందుకు ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి రెండువేల వాహనాలు తరలివెళ్తున్నాయి. భారీ కాన్వాయ్ చేపడుతున్నారు. పెద్ద అంబర్ పేట ఓఆర్ఆర్ కు వాహనాలు చేరుకోనున్నాయి. ప్రతికారులో జనంను తరలించనున్నారు. అక్కడి నుంచి కాన్వాయి ప్రారంభమై మునుగోడుకు చేరుకుంటుంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు జనసమీకరణ చేస్తున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే సుమారు 200ల వాహనాల్లో తరలించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ 300ల వాహనాల్లో ప్రజలను తరలించనున్నట్టు ప్రకటించారు.

ప్రతికారుకు సంబంధిత ఎమ్మెల్యే స్టిక్కర్

ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే.. మునుగోడు సభకు ఎన్నికార్లలో జనంను తరలిస్తున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు స్టిక్కర్ ను అతికిస్తున్నారు. జనం తరలింపుపై గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ భవన్ లో శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఏ ఎమ్మెల్యే ఎన్ని వాహనాల్లో జనం తరలించాలనే విషయాన్ని చర్చించారు. మునుగోడులో సభ అయితే ఇతర ప్రాంతాల నుంచి జనంను తరలించడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మునుగోడులో టీఆర్ఎస్ పై అసమ్మతి ఉండటమా? లేకుంటే టీఆర్ఎస్ బలం ఏమిటో చూపేందుకా? అన్న చర్చ జరుగుతున్నది.

ప్రతి మండలం నుంచి 20వేల మంది...

మునుగోడులో నిర్వహించే ప్రజాదీవెన సభకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. ఈ సభ ఉప ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తుండటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్దమవుతున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో 6 మండలాలు ఉండటంతో ప్రతి మండలం నుంచి 20వేల మంది తరలించేలా ప్రణాళికలు రూపొందించారు. మండలపార్టీ అధ్యక్షులకు సైతం తరలించే బాధ్యతను అప్పగించారు. పార్టీలో అసమ్మతి గళం ఉండటంతో నిర్దేశించిన స్థాయిలో జనంను తరలిస్తారో..? లేదోనని ఇతర నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఎం సమక్షంలో వివిధ పార్టీల నుంచి భారీగా చేర్చుకోనున్నారు. సర్పంచ్ లు, ఎంపీటీసీలతో పాటు మండలపార్టీ అధ్యక్షులను సైతం గులాబీ గూటికీ ఆహ్వానించనున్నట్లు సమాచారం.

కేంద్రమే టార్గెట్‌గా విమర్శలు

తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై మునుగోడు వేదికగా విమర్శలు వాన కురిపించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా, నిధుల విడుదలలో వివక్ష, విభజన హామీలు, ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర విధానాలు, విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టాలని చేస్తున్న ఒత్తిడి, ఐటీఐఆర్ ఇలా కేంద్రంపై మండిపడనున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, 8 ఏళ్లలో చేసిన అభివృద్ధి, ఆసరా పింఛన్లు, రైతు సంక్షేమం, ప్రాజెక్టులు, విద్యుత్ సరఫరా, తదితర విషయాలను ప్రస్తావించి చేసిన అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ కు ఓటువేయాలని ప్రజలను కోరనున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని డిండి ఎత్తిపోతల పథకం కింద చేపడుతున్న చర్లగూడెం, కిష్టరాంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులు పరిహారం తదితర విషయాలను ప్రస్తావించనున్నారు. అందరికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు జరిగిన జాప్యంను ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నట్లు తెలిసింది.

సీఎం టూర్ షెడ్యూల్

మునుగోడులో శనివారం ప్రజాదీవెన సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు సీఎం కేసీఆర్ రోడ్డు మార్గం గుండా భారీ కాన్వాయితో వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయల్దేరుతారు. ఉప్పల్, ఎల్బీనగర్, పెద్ద అంబర్ పేట కు చేరుకోగానే గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేల కాన్వాయి ఘనస్వాగతం పలుకుతుంది. కేసీఆర్ కాన్వాయితో పాటు సభకు చేరుకుంటారు. పోచంపల్లి ఎక్స్ రోడ్డు, చౌటుప్పల్, నారాయణపురం, చల్మెడ, మునుగోడులోని సభా ప్రాంగణానికి మధ్యాహ్నం రెండు గంటల వరకు చేరుకుంటారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం తిరిగి హైదరాబాద్ కు రానున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి :

మునుగోడుకు కేసీఆర్ వరాల జల్లు కురిపించేనా?

నేటి నుంచి మునుగోడులో రేవంత్.. దొరకని ఎంపీ కోమటిరెడ్డి!



Next Story

Most Viewed