ఆర్ అండర్ ఆర్ ప్యాకేజీ ఇంకెప్పుడిస్తరు.. డబ్బులిచ్చేదాకా పనులు మొదలెట్టొద్దు

by  |
ఆర్ అండర్ ఆర్ ప్యాకేజీ ఇంకెప్పుడిస్తరు.. డబ్బులిచ్చేదాకా పనులు మొదలెట్టొద్దు
X

దిశ, మర్రిగూడ : డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో నిర్మాణంలో ఉన్న శివన్న గూడెం, కిష్ట రాయ పల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయి ఏడేళ్లయినా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందకపోవడంతో భూ నిర్వాసితులు ప్రాజెక్టు పనులు జరగకుండా పరిహారం కోసం నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్టు పనులు చేపట్టాల్సి ఉంది. ఈ రెండు ప్రాజెక్టుల్లో 6 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రాజెక్టుల కింద ముంపునకు గురవుతున్న భూ నిర్వాసితుల నుండి భూసేకరణ చేపట్టి నష్ట పరిహారాన్ని ప్రభుత్వం అందజేసింది. కానీ 7 ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నేటికీ అందజేయలేదు. అధికారులు మాత్రం ముంపు గ్రామాలలో పరిహారం కోసం గ్రామ సభలను ప్రతీ ఆరు నెలలకోసారి నిర్వహించి గ్రామసభ ఆమోదం తీసుకుంటున్నారు. కానీ నేటికీ ఇక్కడి భూనిర్వాసితులకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదు. దీంతో అధికారులపై భూ నిర్వాసితులు మండిపడుతున్నారు. కి

ష్ట రాయపల్లి ప్రాజెక్టులో ముంపునకు గురైన లక్ష్మణాపురం, ఈదుల గండి గ్రామాల వారికి చింతపల్లి మండల కేంద్రంలోని మాల్‌లో ప్రభుత్వ భూమిలో ఇల్లు కేటాయిస్తామని రెండు పర్యాయాలు భూ నిర్వాసితులతో అధికారులు నమ్మబలికారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు నేటికీ జారీ కాలేదు. శివన్న గూడెం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న నర్సిరెడ్డి గూడెం, చర్లగూడెం, వెంకేపల్లి తండా గ్రామాల వారికి సైతం మాల్, మర్రిగూడ, శివన్నగూడ గ్రామాలలో ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని అధికారులు తెలిపారు. భూ నిర్వాసితులు సైతం గ్రామసభ ఆమోదం చేసి అధికారులకు అందజేశారు. నేటికీ గ్రామసభ తీర్మానానికి అనుగుణంగా ఇళ్ల స్థలాల కేటాయింపు, ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయలేదు.ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండానే ప్రాజెక్టు పనులు గుత్తేదారు చేస్తుండటంతో భూ నిర్వాసితులు గత 15 రోజుల నుండి రెండు ప్రాజెక్టుల వద్ద టెంటు వేసి నిరసన దీక్షలు చేపడుతున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వెంటనే అందజేసి ఇండ్ల స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.

అధికారులు తమకు సహకరించాలి..

భూ సేకరణ చేసి ఏడేండ్ల గడుస్తున్నా ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నదని, గుత్తేదారులకు ప్రభుత్వం వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందని భూ నిర్వాసితుడు గడ్డి యాదయ్య ఆరోపించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్టు పనులు కొనసాగనిస్తామని ఆయన పేర్కొన్నారు. పదిహేను రోజులు కావొస్తున్నా దీక్షలపై ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

-గడ్డి యాదయ్య, భూ నిర్వాసితుడు

కలెక్టర్ గారు మా మొర ఆలకించవా..

సొంత గ్రామంలో భూములు, ఇండ్లు కోల్పోయి ఊరంతా చెట్టుకొకరు పుట్టకొకరుగా మారాము. మాపై దయ తలచి కలెక్టర్ గారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి యుద్ధ ప్రాతిపదికన తమకు ప్యాకేజీ అందేలా చర్యలు చేపట్టాలని భూ నిర్వాసితులు బాడిగ శ్రీను కోరారు. పోలీసులు మానవత్వంతో మా దీక్షలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

-బాడిగ శ్రీను -భూ నిర్వాసితులు


Next Story

Most Viewed