పోడుభూములకు పట్టాలు ఇవ్వాలని రోడ్డు దిగ్భందం..

by  |
dharna
X

దిశ, నర్సంపేట : ఏండ్లుగా సాగు చేసుకుంటున్న పోడుభూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ రోడ్డు దిగ్భందనం కార్యక్రమం నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లి గ్రామంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి వామపక్షాలు, పలు ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఉదయాన్నే ఇటుకాలపల్లి సెంటర్ కి చేరుకున్న నాయకులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. కొన్ని నిముషాల్లోనే జాతీయ రహదారి 365 పై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ సందర్భంగా తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఈర్ల పైడి మాట్లాడుతూ.. ఏండ్లుగా సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు రావాలంటే రైతులందరూ ఉద్యమించాలన్నారు. ప్రజా ప్రతిఘటనతోనే ఏదైనా సాధ్యమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో పోడు భూముల్ని లాక్కోవడం అన్యాయమన్నారు. భూమిలేని నిరుపేదలు శ్రమించి సాగు చేసుకుంటున్న అటవీభూమిని ప్రభుత్వం బలవంతంగా గుంజుకోవడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు.

అడ్డుకున్న రైతులపై కేసులు పెడుతూ నానా ఇబ్బందులు పాలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్నారు. పోడు భూములపట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదన్నారు. ఇది వారి మనుగడకు మంచిది కాదన్నారు. ఇప్పటికైనా పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ మోడెం. మల్లేష్, ఎం.సి.పి.ఐ రాష్ట్ర నాయకులు బాబురావు, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, ఎం.సి.పి.ఐ.యూ జిల్లా కార్యదర్శి గోనె కుమారస్వామి, తెలంగాణ రైతు కూలీ సంఘం డివిజన్ అధ్యక్షుడు భూమా అశోక్, పీ.వై.ఎల్ జిల్లా కార్యదర్శి ఈర్ల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed