తూకాల్లో అవకతవకలు.. అన్నింటిలో మోసం

by  |
తూకాల్లో అవకతవకలు.. అన్నింటిలో మోసం
X

దిశ, గచ్చిబౌలి: గచ్చిబౌలికి చెందిన స్వాతి బుధవారం ఓ కిరణా షాపునకు వెళ్లింది. కిలో పంచదార కొనుగోలు చేసింది. ఇంటికి వచ్చాక ఆమె భర్తకు అనుమానం వచ్చి తనకు తెలిసిన షాపులో తూకం వేయించాడు. 150 గ్రాములు తక్కువ వచ్చింది. దీంతో ఆమె ఖంగుతిన్నది. అంతేగాక ప్రతి చోట పంచదారే కాదు కందిపప్పు, బియ్యం, నూనె, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఆకుకూరలు అన్నింటిలోనూ మోసం జరుగుతోంది. నగర శివారు ప్రాంతాల్లో వ్యాపారుల చేతుల్లో వినియోగదారులు నిలువునా దోపిడీకి గురవుతున్నారు.

తూనికల్లో అక్రమాలు…

కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో నుంచి రోడ్లమీద విక్రయించే తోపుడుబండ్ల వ్యాపారులకు వరకు తూనికలు,కొలతల్లో నిలువు దోపిడీ జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వేయింగ్ మిషన్లలోనూ, ట్యాంపరింగ్ కు పాల్పడుతూ వినియోగదారులను నిలువునా దోపిడీ చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ప్రధానంగా కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో వివిధ ఆహార పదార్థాల తూనికలు, కొలతల్లో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. తోపుడు బండ్లు, మార్కెట్లలో తూనికల రాళ్ల విషయంలో కూడా సరైన ప్రమాణాలు పాటించడం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో తరచూ వినియోగదారులు, వ్యాపారులకు, మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

జేబుకు చిల్లు…

తూనికల రాళ్ల వాడకంలో కనికట్టు, మాయాజాలంతో వినియోగదారుల జేబులకు చిల్లు పడుతుంది. శేరిలింగంపల్లి, నల్లగండ్ల, తారా నగర్, బీహెచ్ఈఎల్, కొండాపూర్, గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో వ్యాపారులు పాత తూనికలు, కొలతలు వినియోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కిలో చేపలకు 200 గ్రాములు తక్కువగా వస్తుందని చెబుతున్నారు. తూనిక రాళ్లను తనిఖీ చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఎలా బతకాలి…

మరోవైపు నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. దీంతోపాటు కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో నుంచి రోడ్లమీద విక్రయించే తోపుడుబండ్ల వ్యాపారుల వరకూ తూనికలు, కొలతల్లో నిలువు దోపిడీ చేస్తున్నారు. పెరిగిన ధరలకుతోడు వ్యాపారులు ఇలా దోపిడీ చేస్తుంటే ఎలా బతకాలి…? ఇకనైనా అధికారులు స్పందించి మధ్యతరగతి ప్రజల కష్టాలు తీర్చాలి. – స్వాతి, గృహిణి

అధికారులు స్పందించాలి

తూనికలు, కొలతల అధికారుల నిర్లక్ష్యంతోనే వ్యాపారులు మోసం చేస్తున్నారు. డబ్బుకు సరిపడా సరుకులు రావడం లేదు. అడిగితే ఎదురుదాడి చేస్తున్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్ధం కావడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. – దారుపల్లి అనిల్, వినియోగదారుడు

మోసాలపై ఫిర్యాదు చేయండి

సినిమా థియేటర్లు, షాపులు, కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు తదితర దుకాణాల్లో నెల రోజుల వ్యవధిలో వందకు పైగా కేసులు నమోదు చేశాం. ఎమ్మార్పీ కంటే ఎక్కువగా విక్రయించినా చర్యలు తీసుకుంటాం. మోసాలు జరుగుతున్నట్టు తెలిస్తే సెల్ నంబర్ 9000314247 కు ఫిర్యాదు చేయొచ్చు. – అశోక్ రావు, లీగల్ మెట్రాలజీ జిల్లా ఇన్ చార్జి ఇన్ స్పెక్టర్, రంగారెడ్డి.



Next Story

Most Viewed