అభివృద్ధిలో ఆదర్శం.. ‘పీర్జాదిగూడ’

by  |
అభివృద్ధిలో ఆదర్శం.. ‘పీర్జాదిగూడ’
X

పీర్జాదిగూడ కార్పొరేషన్​ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రజా జీవనాన్ని స్తంభింపజేసిన కరోనా కాలంలో బాధితులకు అండగా నిలిచింది కార్పొరేషన్​. 30పడకల సౌకర్యంతో కార్పొరేట్​ ఆస్పత్రులను మరిపించింది. సువిశాలమైన ఆవరణ, ఆహ్లాదకరమైన వాతావరణంలో దాతల సహకారంతో కొవిడ్​ 19 ఐసోలేషన్​ కేంద్రాన్ని ఏర్పాటు చేసి బాధితులకు ఆసరాగా నిలుస్తున్నది.

దిశ, మేడిపల్లి : పీర్జాదిగూడ కార్పొరేషన్ కొవిడ్​ బాధితులను ఆదుకుంటూ రాష్ర్టంలోనే ఆదర్శవంతమైన కార్పొరేషన్ గా నిలిచింది. కరోనా బారిన పడిన వారిని ఆహ్లాదకరమైన వాతావరణంలో పౌష్టిక ఆహారం అందిస్తూ వారిలో ఆత్మస్దైర్యం నింపడమే కాకుండా త్వరగా కొలుకునే విధంగా కార్పొరేషన్​ ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పేద ధనిక అనే తేడా లేకుండా వైద్యం అందరికీ అందుబాటులో ఉండే విధంగా రాష్ట్రంలోనే మొట్ట మొదటి కోవిడ్ ఐసోలేషన్ సెంటర్​ను నెలకొల్పి ఇతర కార్పొరేషన్లకు ఆదర్శంగా నిలిచింది.

రోజుకు 150 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు…

12 మంది సిబ్బందితో ప్రతి రోజు సుమారు 150మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారికి వెంటనే చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు 3,575 టెస్టులు చేసి అందులో పాజిటివ్ వచ్చిన 161 మందికి చికిత్స చేయగా 127 మంది కోలుకున్నారు. 29మందికి చికిత్స అందిస్తున్నట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్​కుమార్ డాక్టర్ విక్టర్ఇమ్మానియేల్, ఐసోలేషన్ సెంటర్ ఇన్​చార్జి డాక్టర్ నాగవర్ధని తెలుపుతున్నారు. 24గంటల పాటు రోగులను పర్యవేక్షిస్తూ అవసరమైన చికిత్సను వైద్య సిబ్బంది అందివ్వడం జరుగుతుంది.

కొవిడ్ నుంచి కోలుకొని దాతలుగా..

పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి నూతన ఆలోచన విధి విధానాలను అభినందించడంతోపాటుగా కోవిడ్ బారిన పడి అదే ఐసోలేషన్ సెంటర్​లో చికిత్స తీసుకొని కోలుకున్న వారు దాతలుగా మారుతున్నారు. ఈ సెంటర్​కు విరాళాలు ఇస్తున్న వారి ఆదరణ రోజు రోజుకి పెరుగుతుంది. వచ్చిన విరాళాలను తిరిగి మళ్లీ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ నిర్వహణకు ఉపయోగిస్తున్నారు.

వీధి కుక్కల నియంత్రణకు చర్యలు..

కార్పొరేషన్ పరిధిలో రోజురోజుకు పెరుగుతున్న వీధి కుక్కలను అరికట్టడానికి రూ.20లక్షలతో కుక్కల సంతాన నియంత్రణ కోసం 3వ డివిజన్​లో నూతనంగా సంతాన నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పలు డివిజన్ల నుంచి వీధి కుక్కలను పట్టి వాటిని ప్రత్యేక వాహనంలో తీసుకొస్తారు. వాటికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి వెటర్నరీ డాక్టర్ పర్యవేక్షణలో శస్త్ర చికిత్స నిర్వహిస్తారు. ప్రతి కుక్కకి యాంటిబయోటిక్ మందులు, రేబిస్ వ్యాక్సిన్లను ఇచ్చిన తరువాత మూడురోజుల పర్యవేక్షణ అనంతరం వదిలి పెడుతారు. దీంతో వీధి కుక్కల బెడద నుండి ఉపశమనం కల్పించారు.

అన్ని విధాల అభివృద్ధి చేస్తా.. -మేయర్ జక్కా వెంకట్ రెడ్డి

కార్పొరేషన్​ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాను. దాతల సహయంతో కోవిడ్ 19 ఐసోలేషన్ సెంటర్ నిర్వహణ సులభతరం అయింది. కరోనా నుంచి కోలుకున్న వారు దాతలుగా ముందుకు రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. కుక్కల సంతాన నియంత్రణ కేంద్రం ఏర్పాటుతో రానున్న రోజుల్లో రేబిస్ ఫ్రీ కార్పొరేషన్ గా చూడడమే లక్ష్యం. పార్క్ లను ఏర్పాటు చేయడం కోసం రూ.6కోట్ల నిధులను కేటాయించాం. 3వ డివిజన్​లో రాక్ గార్డెన్ ను ఏర్పాటు చేశాం. రాష్ర్టంలో కార్పొరేషన్ ను మొదటి స్థానంలో నిలబెడుతా.

అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం.. -కమిషనర్ శ్రీనివాస్

కౌన్సిల్ తీర్మానాలను పక్కాగా అమలు చేసి ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఆరోగ్యకరమైన వాతావరణం కోసం ప్రతి డివిజన్ లో ఒక పార్క్ ను అభివృద్ధి చేస్తున్నాం. రానున్న రోజుల్లో అందమైన 100 పార్క్​లను ఏర్పాటు చేయనున్నాం. అక్రమ నిర్మాణాలపై కఠిన నిర్ణయాలను అమలు చేస్తున్నాం. నిబంధనల ప్రకారమే నిర్మణాలు చేపట్టి ప్రజలు సహకరించాలి. సమష్టి కృషితో కార్పొరేషన్​ను అభివృద్ధి చేస్తాం.



Next Story

Most Viewed