పేటీఎమ్ ఐపీఓ పరిమాణం రూ. 18,300 కోట్లకు పెంపు!

by  |
Paytm
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ డిజిటల్ ఆర్థిక సేవల కంపెనీ పేటీఎమ్ త్వరలో ఐపీఓకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఐపీఓపై పెట్టుబడిదారులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మొత్తం రూ. 16,600 కోట్ల నిధులను సమీకరించనున్నట్టు పేటీఎమ్ సంస్థ గతంలోనే ప్రకటించింది. అయితే, తాజాగా ఈ ఇష్యూ సైజ్‌ను రూ. 18,300 కోట్లకు పెంచింది. పేటీఎమ్ సంస్థలోని అతిపెద్ద వాటాదారులుగా ఉన్న అలీబాబా గ్రూప్ కంపెనీ యాంట్‌ఫిన్ (నెదర్లాండ్స్) హోల్డింగ్స్, సాఫ్ట్‌బ్యాంక్‌ల వాటాలను పెంచడమే దీనికి కారణం.

తాజా సమాచారం ప్రకారం అదనంగా రూ. 1,700 కోట్ల ఇష్యూ పరిమాణం పెరిగింది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వద్ద పేటీఎమ్ దాఖలు చేసిన ముసాయిదా ప్రకారం.. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా పేటీఎమ్ రూ. 8,300 కోట్లకు అదనంగా మరో రూ. 1,700 కోట్లను జతచేయనుంది. దీంతో ఆఫర్ ఫర్ సేల్ మొత్తం పరిమాణం రూ. 10,000 కోట్లకు పెరిగింది. కాగా, ఈ ఐపీఓ గనక విజయవంతమైతే భారత్‌లోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా పేటీఎమ్ నిల్వనుంది. ఇప్పటివరకు 2010లో కోల్ ఇండియాకు చెందిన రూ. 15,200 కోట్ల ఐపీఓనే అతిపెద్దదిగా ఉంది. అలాగే, ప్టీఎమ్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 8వ తేదీన ప్రారంభమై 10న ముగియనుంది. అదేవిధంగా నవంబర్ 18న స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ చేయాలని కంపెనీ భావిస్తోంది.


Next Story

Most Viewed