రూ. 50 వేల కోట్లకు పైగా నష్టపోయిన పేటీఎం!

by  |
Paytm
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్ షేర్ల పతనం కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన రోజు నుంచే తీవ్ర నష్టాలను చూస్తున్న కంపెనీ స్టాక్ విలువ సోమవారం ట్రేడింగ్‌లో ఏకంగా 12.74 శాతం పతనమై రూ. 1,362 వద్ద క్లోజయింది. లిస్టింగ్ సమయంలో ఇష్యూ ధర 2,150 కంటే ప్రస్తుతం 44 శాతం పతమైంది. ఈ పరిణామాలతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 1.39 లక్షల కోట్ల నుంచి రూ. 88,184.67 కోట్లకు పడిపోయింది. దీంతో పేటీఎం కంపెనీ రూ. 50 వేల కోట్లకు పైన నష్టపోయింది. ఇదే సమయంలో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ గ్రాస్ మర్చండైజ్ వాల్యూను (జీఎంవీ) రూ. 1,95,600 కోట్లుగా నమోదైంది. గతేడదితో పోలిస్తే ఇది రెండింతల వృద్ధితో రికార్డు నమోదు చేసింది.

పేటీఎం సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ అయిన తర్వాత కార్యకలాపాలకు సంబంధించి వివరాలను వెల్లడించడం ఇదే ప్రథమం. ఏదైనా కంపెనీ అధించే ఇతర ఉత్పత్తుల నుంచి వ్యాపారులకు చెల్లించే మొత్తాన్ని జీఎంవీగా పరిగణిస్తారు. ఇందులో వినియోగదారుల మధ్య జరిగే లావాదేవీలకు మనహాయింపు ఉంటుంది. గతేడాది ఇదే నెలలో కంపెనీ జీఎంవీ రూ. 36 వేల కోట్ల నుంచి 131 శాతం వృద్ధితో రూ. 83,200 కోట్లకు చేరుకుంది. అదేవిధంగా పేటీఎం లావాదేవీలను వాడుతున్న వినియోగదారుల సంఖ్య సైతం ఈ త్రైమాసికంలో 33 శాతం పెరిగి 5.7 కోట్లకు చేరాయి.



Next Story