గూగుల్‌పై ఆ కంపెనీల అసంతృప్తి

by  |
గూగుల్‌పై ఆ కంపెనీల అసంతృప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల గూగుల్ వ్యవహార శైలి కారణంగా భారత్‌లోని టెక్ కంపెనీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, దీన్ని ఎంతమాత్రం కొనసాగించే అవకాశాల్లేవని, గూగుల్‌తో తాడోపేడో తేల్చుకోవడానికి టెక్ కంపెనీలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కొద్దిరోజుల క్రితం గూగుల్ ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించిన నేపథ్యంలో మొదటిసారిగా టెక్ కంపెనీల స్వరం మారింది. దీంతో గూగుల్‌తో వివాదానికి సిద్ధమవుతున్నట్టు మిగిలిన టెక్ కంపెనీలు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

సాధారణంగా యాప్స్ వినియోగించాలంటే గూగుల్ ప్లేస్టోర్ ఎంతో కీలకం. ఎక్కువ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారంగానే పనిచేస్తున్నాయి. అందుకే గూగుల్ ఇష్టమొచ్చిన రీతిలో నిర్ణయాలను తీసుకుంటున్నట్టు టెక్ కంపెనీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇటీవల పరిణామాల నేపథ్యంలో గూగుల్ ఆధిపత్యంపై భారత్‌లోని టెక్ కంపెనీలు ముఖ్యంగా గత కొన్నేళ్లలో ప్రారంభమైన స్టార్టప్ కంపెనీలు గూగుల్‌పై గరంగరంగా ఉన్నట్టు తెలుస్తోంది. యాప్‌ల విషయంలో గూగుల్ అనుసరిస్తున్న విధానాలు అన్యాయమని, రానున్న కొద్ది రోజుల్లో గూగుల్‌తో విభేదించే కంపెనీల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని ఇండియా మార్ట్ సీఈవో దినేశ్ అగర్వాల్ తెలిపారు.

కాగా, సెప్టెంబర్ నెలలో గూగుల్ సంస్థ అనూహ్యంగా ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించడంతో ఈ వివాదం ప్రారంభమైంది. ప్లేస్టోర్ నిబంధనలను పేటీఎం అతిక్రమించిందనేది గూగుల్ అభియోగం. అయితే, అదేరోజు సాయంత్రానికి పేటీఎం మళ్లీ ప్లేస్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది. దీనిపై పేటీఎం వ్యవస్థాపుకుడు శేఖర్ శర్మ సీరియస్‌గానే స్పందించారు. గూగుల్ ఆధిపత్య ధోరణితో వ్యవహరించిందని, యాప్‌లకు ప్రధానమైన ప్లేస్టోర్‌ను నియంత్రిస్తోందని, దీన్ని అడ్డుకునేందుకు దేశీయ టెక్ కంపెనీలన్నీ ఏకమవ్వాలని, భవిష్యత్తు అవసరాలను తీర్చే అవకాశాలను వెతకాలని చెప్పారు.


Next Story