పేటీఎమ్ మాల్, గ్రోఫర్స్ కంపెనీల విలీన చర్చలు!

by  |
పేటీఎమ్ మాల్, గ్రోఫర్స్ కంపెనీల విలీన చర్చలు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: నోట్ల రద్దు, జీఎస్టీ వంటి పరిణామాలు దేశంలో తెచ్చిన అనూహ్య మార్పుల కారణంగా బాగా ప్రచారం పొందిన డిజిటల్ సంస్థ పేటీఎమ్. డిజిటల్ పేమెంట్ రంగంలో అనేక మార్పులను తెచ్చిన ఈ సంస్థ మరో కీలక నిర్ణయం దిశగా వెళ్తోంది. ఇటీవల పేటీఎమ్ మాల్ పేరుతో ఈ సంస్థ ఈ-కామర్స్ సంస్థను ప్రారంభించింది. కొత్తలో తీవ్రంగా నష్టపోయిన ఈ సంస్థ తాత్కాలికంగా కార్యకలాపాలను ఆపేసింది. అయితే, ఇటీవల మళ్లీ పనులను ప్రారంభించింది. దేశంలో లాక్‌డౌన్ కారణంగా గ్రాసరీస్‌కి డిమాండ్ పెరగడంతో ఈ విభాగంలో ఉన్న బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్ కంపెనీలు విపరీతంగా ఆర్డర్లు అందుకున్నాయి. ఆర్డర్లు వచ్చిన స్థాయిలో డెలివరీలు చేసేందుకు ఆ కంపెనీలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేటీఎమ్ సంస్థ వ్యూహాత్మక నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టు సమాచారం. పేటీఎమ్ మాల్‌లో గ్రోఫర్స్ కంపెనీని విలీనం చేసుకునేందుకు రెండు సంస్థల మధ్య చర్చలు మొదలైనట్టు తెలుస్తోంది. ఈ రెండు సంస్థల్లోనూ ప్రధాన ఇన్వెస్టర్‌గా జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంకు ఉంది. కొద్ది రోజులుగా సాఫ్ట్ బ్యాంకు భారీగా నష్టాలను చవిచూస్తోంది. ఈ క్రమంలో కొత్త పెట్టుబడులను తీసుకురావడం సాధ్యం కాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పేటీమ్‌లో కానీ, గ్రోఫర్స్‌లో కానీ పెట్టుబడులు పెట్టడం కుదరని పని. అందుకే రెండు సంస్థలను విలీనం చేయాలనే ప్రతిపాదనతో ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. దీనివల్ల ఖర్చులు తగ్గడమే కాకుండా లాభాల్లోకి పయనించవచ్చని భావిస్తున్నారు.

పేటీఎమ్ మాల్ ప్రస్తుతం రూ. 1,275 కోట్ల నిధులను కలిగి ఉంది. ఈ నిధులను ఉపయోగించి గ్రోఫర్స్ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని సాఫ్ట్ బ్యాంకు భావిస్తోంది. కొత్త నిధులను సమీకరించడం కష్టమైనందున ఈ విలీనం ద్వారా రెండు సంస్థలను ఒకే వేదికపైకి తీసుకొస్తే ఫలితాలు సానుకూలంగా ఉంటాయని ఆలోచిస్తున్నారు. సాఫ్ట్‌బ్యాంకుకు పేటీఎమ్ మాల్‌లో దాదాపు 20 శాతానికిపైగా వాటా ఉండగా, గ్రోఫర్స్‌లో 40 శాతం వాటా ఉంది. గ్రోఫర్స్‌లో సాఫ్ట్ బ్యాంకే ప్రధాన వాటాదారుగా ఉంది. ఈ కారణాల వల్లే రెండు సంస్థల విలీనం అయ్యే అవకాశాలెక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒప్పందానికి సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఏకాభిప్రాయం కుదిరాక విలీనం ఖరారు అవొచ్చని సమాచారం.

Next Story

Most Viewed