క్రెడిట్ బకాయిలు చెల్లించాల్సిందే !

by  |
క్రెడిట్ బకాయిలు చెల్లించాల్సిందే !
X

– కస్టమర్లకు క్రెడిట్ కార్డు కంపెనీల సమాచారం

– సిబిల్ స్కోర్ మీద ప్రభావం పడుతుందని సూచన

దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ విధింపు కాలంలో టర్మ్ లోన్లు, క్రెడిట్ కార్డు చెల్లింపులు చెల్లించకపోయినా సిబిల్ స్కోరు మీద ప్రభావం చూపదని, మూడు నెలల తర్వాత పెండింగ్ బిల్లులు చెల్లించొచ్చని ఆర్బీఐ సూచించింది. అయితే క్రెడిట్ సంస్థలు మాత్రం ఈ సూచనలకు విరుద్ధంగా వినియోగదారులకు సంక్షిప్త సందేశాలు పంపిస్తున్నాయి. క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించకపోతే ఆ ప్రభావం సిబిల్ స్కోరు మీద పడుతుందని ఆ సంక్షిప్త సందేశాల సారాంశం.

బ్యాంకులు, క్రెడిట్ కార్డు సంస్థలు.. వ్యక్తిగత బ్యాంకింగ్, బ్యాంక్ స్టేట్మెంట్స్, సిబిల్ స్కోరు ఆధారంగా వివిధ రకాల లోన్లు, క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తాయి. కరోనా నివారణలో భాగంగా లాక్‌డౌన్ విధించడంతో ఆర్థిక కార్యకలాపాలకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉండటంతో ఆర్బీఐ స్పందించి.. బ్యాంక్, క్రెడిట్ వినియోగదారులకు సంబంధించి పలు మార్గనిర్దేశకాలు జారీ చేసింది.

మార్చి 1 నుంచి మే 31 వరకు మారటోరియం విధించింది. ఈ కాలంలో ఈఎంఐలు, క్రెడిట్ కార్డు చెల్లింపుల నుంచి వినియోగదారులకు మినహాయింపునిచ్చింది. అయితే టర్మ్ కాలం లేదా ఈఎంఐ మొత్తాన్ని పెంచేందుకు బ్యాంకులకు అవకాశం కల్పించింది. క్రెడిట్ కార్డు బిల్లులకు కూడా ఈ మినహాయింపునిచ్చింది. క్రెడిట్ కార్డు పెండింగ్ బిల్లులకు ఈ మారటోరియం కాలానికి కూడా ఊరట కల్పించింది. మారటోరియం ముగిసిన తర్వాత చెల్లించిన కూడా సిబిల్ స్కోరు మీద ఎలాంటి ప్రభావం చూపదని ఆర్బీఐ పేర్కొంది. అయితే కొన్ని కంపెనీలు మాత్రం మారటోరియం కాలంలో క్రెడిట్ కార్డు చెల్లింపులు చేయకుంటే సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపుతుందనే అర్థమొచ్చేలా కస్టమర్లకు సమాచారమిస్తున్నాయి. దీంతో లాక్‌డౌన్ కాలంలో ఉద్యోగాలు, వ్యాపారులు నడవక ఇబ్బందులు పడుతుంటే పెండింగ్ బిల్లులు ఎలా చెల్లించాలని వినియోగదారులు తలలు పట్టుకుంటున్నారు. మారటోరియం కాలంలో రిజర్వ్ మనీ ఉన్నవారు చెల్లించాలనుకుంటే చెల్లించవచ్చు. అయితే కచ్చితంగా చెల్లించాలని నిబంధనమే లేదు. చెల్లింపులు జరపకుంటే.. ఆ ప్రభావం క్రెడిట్ స్కోర్ మీద పడుతుందని చెబుతూ కొన్ని బ్యాంకులు, క్రెడిట్, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు తమ వినియోగదారులకు సమాచారాన్ని అందిస్తున్నాయి.

హెచ్ఎస్‌బీసీ, సిటీ క్యాష్ బ్యాక్, ఐఏసీ ప్లాటినం, హెచ్‌డీఎఫ్‌సీ, యాత్ర ఎస్బీఐ, ఇండస్ బ్యాంకు తదితర కార్డులు టాప్ టెన్ జాబితాలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 5 కోట్ల 17 లక్షల క్రెడిట్ కార్డుల ఉన్నట్టు తాజాగా ఆర్బీఐ అంచనా వేసింది. వీరందరికి ఈ మూడు నెలల కాలానికి చెల్లింపుల నుంచి మినహాయింపునిచ్చారు. అయితే క్రెడిట్ సంస్థలు మాత్రం బిల్లు చెల్లించాలని కస్టమర్లకు సూచిస్తున్నాయి. కాగా, లాక్‌డౌన్ కాలంలో ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నామని, ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని క్రెడిట్ కార్డు వినియోగదారులు కోరుతున్నారు.

క్రెడిట్ బిల్ చెల్లించాలని అడుగుతున్నాయి – రాజశేఖర్, ప్రైవేటు ఉద్యోగి, హైదరాబాద్

రెండేండ్ల నుంచి టాటా కేపిటల్ క్రెడిట్ కార్డు వాడుతున్నాను. ప్రతీ నెల కరెక్టుగా బిల్లు చెల్లిస్తున్నాను. ఒక్క మార్చి నెల మాత్రమే పెండింగులో ఉంది. ప్రస్తుతం జీతం కూడా రావడం లేదు. మారటోరియంలో ఏప్రిల్, మే మాత్రమే నాకు వర్తిస్తుంది. ఆఫీస్ మొదలయ్యాక రెండు నెలల బిల్లు ఒకేసారి చెల్లిస్తాను. ఆర్బీఐ కూడా మినహాయింపునిచ్చింది. ఏప్రిల్ బిల్లు రూ. 5 వేల వరకు వచ్చింది. ఈ నెల 25న చెల్లించాలి. ఈ నెల ఎలాగూ కార్డు వాడే పరిస్థితి లేదు. బ్యాంకులే అర్థం చేసుకుని మా సిబిల్ స్కోరు మీద రిమార్కులు ఇవ్వకూడదు.

మారటోరియంపై బ్యాంకుల నిర్ణయం..

మారటోరియం కాలానికి సంబంధించి క్రెడిట్ చెల్లింపులపై స్వీయ నిర్ణయాధికారాన్ని ఆర్బీఐ.. బ్యాంకులకే అప్పజెప్పింది. వినియోగదారులు వారి ఆర్థిక వనరుల ఆధారంగా చెల్లింపులు చేయాలా వద్దా అనేది నిర్ధారించుకోవచ్చు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ, యూకో బ్యాంక్, పంజాబ్ ఇండ్, రెప్కో హోం ఫైనాన్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆటోమేటిక్‌గా తమ వినియోగదారులకు ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. వినియోగదారులు చెల్లింపులు జరపాలంటే బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, పీఎన్బీ, ఇండియా బుల్స్ హౌజింగ్ సంస్థలు.. కస్టమర్లు కోరితేనే చెల్లింపుల నుంచి మినహాయిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంకు, ఐడీఎఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు వంటి సంస్థలు కస్టమర్ల లోన్ హిస్టరీ ఆధారంగా మినహాయింపునిస్తున్నాయి.


Next Story