విజయదశమి నాడు తేజ్ ఇంటికి రావడం సంతోషాన్నిచ్చింది: పవన్ కల్యాణ్

by  |
Pawan Kalyan
X

దిశ, ఏపీ బ్యూరో: మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సెప్టెంబర్ నెలలో బైక్ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సాయిధరమ్ తేజ్ కోమాలోకి వెళ్లిపోయాడు. 35 రోజులపాటు వైద్యులు శ్రమించడంతో కోమా నుంచి కోలుకున్నాడు. పూర్తి ఆరోగ్యంగా ఉండటంతో సాయిధరమ్ తేజ్‌ను వైద్యులు శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. తేజ్ డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన విషయాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ‘అనుకోని రీతిలో ప్రమాదం బారిన పడి గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిన సాయి ధరమ్ తేజ్ కోలుకుని ఈ రోజు క్షేమంగా ఇంటికి చేరాడు. విజయదశమి పర్వదినాన తేజ్ ఆరోగ్యంగా ఇంటికి రావడం మా కుటుంబం అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ రోజు తేజ్ పుట్టిన రోజు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకొని ప్రేక్షకుల ప్రేమాభిమానాలు మరింతగా పొందాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తేజ్ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి అభిమానులు ఎంతో బాధపడి, తేజ్ క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. ఆలయాల్లో, ప్రార్థనా మందిరాల్లో పూజలు చేశారు. వారందరి ప్రార్థనలు ఫలించాయి. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని పవన్ తెలిపారు.

ఇదిలా ఉంటే నేడు సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు కూడా కావడంతో శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సైతం సాయిధరమ్ తేజ్ డిశ్చార్జ్‌పై స్పందించారు. ఇది పునర్జన్మ అంటూ చెప్పుకొచ్చారు.


Next Story

Most Viewed