వనజీవి రామయ్య పేరు మీద సేవ చేస్తా: పవన్

by  |
Pawan
X

దిశ, వెబ్‌డెస్క్: కోటికి పైగా మొక్కలు నాటిన పుడమి పుత్రుడు దరిపెల్లి రామయ్య ఎందరికో ఆదర్శమూర్తి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మాటలతోనే కాకుండా చేసే పనుల ద్వారా కీర్తి ప్రతిష్టలు పొందుతారు అనడానికి ఆయన నిలువెత్తు నిదర్శనం అని పవన్ కొనియాడారు. నిస్వార్థంతో వనాలను పెంచి వనజీవి రామయ్యగా విఖ్యాత అయ్యారన్నారు. ఆయన చేసిన సేవకు పద్మశ్రీ వంటి అత్యన్నత పురస్కారం కూడా వెతుక్కుంటూ వచ్చి రామయ్య కీర్తి కిరీటంలో ఒదిగిపోయిందని పవన్ గుర్తు చేశారు.

అటువంటి స్ఫూర్తి దాత తనను ఉద్దేశించి విడుదల చేసిన వీడియో.. తనలో మరింత బాధ్యతలను పెంచాయని పవన్ తెలిపారు. పచ్చదనమే స్వధనంగా భావించే రామయ్య మాటలు శిరోధార్యంగా భావిస్తానని జనసేనాని చెప్పారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. డొక్కా సీతమ్మ పేరు మీద ఆహార శిబిరాలను నిర్వహించిన విధంగానే.. వనజీవి పేరు మీద కూడా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి.. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుపై అవగాహన కల్పిస్తామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

Next Story