‘ఆ పరిస్థితే భారంగా మారింది’

by  |
‘ఆ పరిస్థితే భారంగా మారింది’
X

దిశ, తెలంగాణ బ్యూరో : కర్నాటక, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా పేషెంట్ల ట్రీట్‌మెంట్ తలకు మించిన భారంగా ఉందని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతీరోజూ బులెటిన్‌లో కనిపిస్తున్న గణాంకాలకు, వాస్తవిక పరిస్థితికి తేడా రావడానికి ఇదే కారణమని వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో పాజిటివ్ బారిన పడుతున్న పేషెంట్ల సంఖ్యతో పోలిస్తే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉన్నదన్నారు. పేషెంట్లకు ఆక్సిజన్, రెమిడెసివిర్, టోసిలిజుమాబ్ లాంటివాటికి కొరత ఏర్పడడానికి, డిమాండ్ ఎక్కువ కావడానికి ఇదే కారణమన్నారు. ఈ పేషెంట్లంతా వారివారి రాష్ట్రాల్లో పాజిటివ్‌‌గా నిర్ధారణ అయినవారేనని, తెలంగాణ లెక్కల్లోకి రానివారని వివరించారు. కేంద్ర వైద్యారోగ్య మంత్రి హర్షవర్ధన్ ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సుకు ముఖ్యమంత్రి ప్రతినిధిగా హరీశ్‌రావు హాజరై పై వివరణ ఇచ్చారు.

తెలంగాణ జనాభా, పాజిటివ్ కేసులను లెక్కలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్, రెమిడిసివిర్, టోసిలిజుమాబ్ లాంటి మందుల్ని కేటాయించినట్లయితే అవసరాలకు సరిపోవని, కోటా పెంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు 450 టన్నుల ఆక్సిజన్‌ను మాత్రమే కేంద్రం కేటాయించిందని, దీన్ని 600 టన్నులకు పెంచాలని కోరారు. ప్రస్తుతం ఒడిశా నుంచి ఆక్సిజన్ వస్తూ ఉన్నదని, దగ్గరలో వున్న రాష్ట్రాల నుంచి క్రయోజనిక్ ట్యాంకర్లను కేటాయించాలని కోరారు. రెమిడిసివర్ ఇంజిక్షన్లను రోజుకు 20 వేల మేర సరఫరా చేయాలని, ఎయిర్ అంబులెన్సుల ద్వారా అత్యవసర చికిత్సకోసం ఇతర ప్రాంతాల నుంచి కరోనా పేషెంట్లు తెలంగాణకు వస్తున్నందున టోసిలిజుమాబ్ ఇంజెక్షన్ల కోటాను 810 నుంచి 1500కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణకు రోజూ రెండు లక్షల మేర టెస్టింగ్ కిట్ల అవసరముందని ఆ ప్రకారం సరఫరా చేయాలన్నారు.

రాష్ట్రంలో టీకాలకు ఉన్న కొరత దృష్ట్యా రెండో డోస్ మాత్రమే ఇస్తున్నామని, 45 సంవత్సరాలకు పైబడిన వారికి పూర్తి చేయాలంటే ఇంకా 1.29 కోట్ల డోసులు అవసరమని వివరించారు. ఈనెల చివరి వరకు మొత్తం 13 లక్షల డోసుల అసరమున్నదని, వెంటనే రాష్ట్రానికి సరఫరా చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల పేషెంట్లు కూడా భారీ సంఖ్యలో ట్రీట్‌మెంట్ పొందుతున్న దృష్ట్యా సుమారు 2000 వెంటిలేటర్ల అదనపు అవసరం ఏర్పడిందని, తక్షణమే వీటిని సరఫరా చేయాలని హరీశ్‌రావు విజ్జప్తి చేశారు.

ప్రస్తుతం కరోనా లక్షణాలున్నవారిని గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వే చేస్తూ ఉందని, సుమారు 27 వేల మందితో కూడిన ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, నర్సులు దాదాపు 60 లక్షల ఇండ్లలో ఫీవర్ సర్వే నిర్వహించిందని, ఏ పరిస్థితుల్లోనైనా అడ్మిట్ కావచ్చన్న అంచనాతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్‌ల సంఖ్యను గణనీయంగా పెంచిందని కేంద్ర మంత్రికి వివరించారు.

కోటాను పెంచుతాం : కేంద్ర మంత్రి హర్షవర్ధన్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి తగ్గుముఖం పడుతోందని వ్యాఖ్యానించిన కేంద్ర వైద్యారోగ్య మంత్రి హర్షవర్దన్ రాష్ట్ర మంత్రి విజ్ఞప్తి మేరకు ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు, వ్యాక్సిన్లు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు తదితరాలను హెచ్చు మోతాదులో పంపిస్తామని, సత్వరం సరఫరా అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Next Story