ఆస్పత్రికి రాకుండా ‘ఓపీ’క పడుతుండ్రు!

by  |
ఆస్పత్రికి రాకుండా ‘ఓపీ’క పడుతుండ్రు!
X

దిశ, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా(కోవిడ్-19) వైరస్ ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఈ వైరస్ ప్రభావంతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. కరోనాకు సంబంధించి అనుమానితులు, పాజిటివ్‌గా నిర్ధారింపబడిన వ్యక్తులకు ఫీవర్, గాంధీ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసి వైద్యసేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ జబ్బులతో ఇబ్బందిపడే చాలామంది రోగులు ఈ ఆస్పత్రులకు రావడానికి బెంబేలెత్తుతున్నారు.

కనబడని ఓపీ రోగులు

ప్రస్తుతం ఫీవర్ ఆస్పత్రిలో సుమారు 15 మంది కరోనా అనుమానితులు ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. కరోనా అనుమానితులు సౌకర్యార్థం ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. సాధారణ రోజుల్లో ఫీవర్ ఆస్పత్రికి 1,000 నుంచి 1,200 మంది ఔట్ పేషెంట్లు వస్తుంటారు. వైరల్ జ్వరాలు అధికంగా వచ్చే వర్షాకాలం, శీతాకాలంలో ఈ సంఖ్య 2 వేల నుంచి 3 వేల వరకూ పెరుగుతుంటారు. ప్రస్తుత కరోనా కారణంగా ఓపీ రోగుల సంఖ్య కనీసం 500లకు కూడా చేరడం లేదు. గాంధీ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సాధారణ రోగులు 2,500 నుుంచి 3 వేల వరకూ ఉంటారు. కానీ, ప్రస్తుతం 1200 నుంచి 1500 వరకూ మాత్రమే ఉన్నారు. నగరంలోని ఈ రెండు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ రోగులు దాదాపుగా సగానికి పడిపోయారు.

అక్కడాలేరు.. ఇక్కడాలేరు

పరీక్షల నిర్ధారణ కేంద్రం ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసన్(ఐపీఎం) కేంద్రం నగరంలో అత్యంత ప్రాముఖ్యమైంది. వ్యాధుల నిర్ధారణకు, ఉన్నతమైన పరీక్షలకు శాంపిల్స్ అత్యధిక శాతం ఇక్కడికే పంపిస్తుంటారు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో వైద్యవిభాగం అంతా అప్రమత్తమై ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అలర్టుగా ఉన్నారు. కరోనావ్యాప్తిని ముందస్తుగా నివారించే జాగ్రత్తల్లో భాగంగా ప్రభుత్వం విద్యా సంస్థలతోపాటు ఇతర ప్రయివేటు సంస్థలకూ సెలవులు ప్రకటించింది. ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకర్ ఐపీఎం డైరెక్టర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డాక్టర్ శంకర్ ఉదయం వేళలో నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో,సాయంత్రం వేళ నారాయణ‌గూడ ఐపీఎం కేంద్రంలోనూ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈ విషయమై దిశ ప్రతినిధి ఫీవర్ ఆస్పత్రిలో వాకబు చేస్తే మధ్యాహ్నం 12 గంటలకు వస్తారని చెప్పారు. కాని రాలేదు. నారాయణగూడ ఐపీఎంలోనూ డాక్టర్ గురించి వాకబు చేయగా మధ్యాహ్నం 3గంటలకు వస్తారని చెప్పారు. కాని రాలేదు. కరోనా ప్రబలుతున్న ఈ సందర్భంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన డాక్టర్ అందుబాటులో లేకపోవడమేంటని పలువురు అంటున్నారు.

Tags : fever hospital, patients, corona(covid-19)

Next Story