కరోనా కిట్‌పై మాట మార్చిన పతంజలి

by  |
కరోనా కిట్‌పై మాట మార్చిన పతంజలి
X

దిశ, వెబ్ డెస్క్: కరోనావైరస్‌కు మందు కనిపెట్టానంటూ ప్రకటించిన పతంజలి సంస్థ వ్యవహారం సంచలనం రేపిన విషయం తెలిసిందే. దానిపై దుమారం రేగుతుండగానే.. తాజాగా కరోనిల్‌ ఔషధంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనిల్‌పై ఎక్కడా కోవిడ్ 19 పేరు గానీ, కరోనా పేరు గానీ వాడకూడదని స్పష్టం చేసింది. కరోనాను నయం చేసే మందుగా ప్రచారం చేయకూడదని.. కేవలం ఇమ్యూనిటీ బూస్టర్‌గా మాత్రమే అనుమతులు మంజూరు చేశామని క్లారిటీ ఇచ్చింది. ఆ కిట్‌పై ఎక్కడా కరోనా వైరస్‌ను తలపించే ఫొటోలను వాడకూడదని ఆదేశించింది.

పతంజలి సంస్థ జూన్ 24న కరోనా నివారణ ముందు పేరిట కరోనిల్‌, శ్వాసరిలను ఆవిష్కరించింది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యోగా గురువు రాందేవ్ బాబా, పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ పాల్గొన్నారు. కరోనాను తరిమికొట్టే తొలి ఆయుర్వేద ముందు ఇదేనని వారు చెప్పారు. ఈ మందు తీసుకున్న తర్వాత 69శాతం మంది కరోనా పేషెంట్లు కేవలం 3 రోజుల్లోనే కోలుకున్నారని చెప్పారు. ఇక ఏడు రోజుల్లో వందశాతం కోలుకున్నారని తెలిపారు.

రాజస్థాన్ జైపూర్ నిమ్స్ వైద్యులు, పలువురు శాస్త్త్రవేత్తల సహకారంతో 150కి పైగా ఔషధ మూలికలతో కరోనిల్ ఔషదాన్ని రూపొందించామని పతంజలి సంస్థ ఇటీవల ప్రకటించింది. శాస్త్రీయ అధ్యయనం, ఔషధ ప్రయోగాలు చేసిన తర్వాతే తాము కరోనిల్ మందును మార్కెట్లో విడుదల చేశామని రాందేవ్ బాబా తెలిపారు. ఇందులో అశ్వగంధ, తిప్పతీగ వంటి ఔషద మూలికలు ఉన్నాయని వెల్లడించారు. పతంజలి కరోనా కిట్ రూ.545కి అందుబాటులో ఉంటుందని చెప్పారు.

ఐతే బాబా రాందేవ్ చేసిన ప్రకటనపై కేంద్ర ఆయుష్ శాఖ అభ్యంతరం చెప్పింది. ఈ మందును లాంచ్ చేసిన కొన్ని గంటల్లోనే… పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా ఆ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. ఇమ్యూనిటీ బూస్టర్‌ పేరుతో దరఖాస్తు చేసి.. ఇప్పుడు కరోనా ముందని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించింది. అంతేకాదు పతంజలి సంస్థలపై పలు చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. ఆ తర్వాత ఉత్తరాఖండ్ జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇస్తూ.. మాటమార్చింది పతంజలి. తాము కరోనా కిట్‌గా ఎక్కడా ప్రచారం చేయలేదని.. కేవలం ఔషధ ప్రయోగం విజయవంతమైనట్లు మాత్రమే చెప్పామని పతంజలి ప్రతినిధులు తెలిపారు.

Next Story