రంగులు మారుతున్న రాజకీయం

by  |
రంగులు మారుతున్న రాజకీయం
X

దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక ఉప ఎన్నికల్లో రోజురోజుకూ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఆయా ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం చేస్తూనే పక్క పార్టీలో ఉన్న బడా లీడర్ల నుండి గల్లీ లీడర్ల వరకు తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. కొందరు లీడర్లు ఒకే రోజు రెండు పార్టీలు మారుతున్నారు. ఉదయం ఒక పార్టీలో చేరితే, సాయంత్రం మరో పార్టీలో చేరుతున్నారు. దాంతో ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రత్యర్థిని వీక్ చేసేందుకు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తూ పార్టీలు ఫిరాయించేలా ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జంపింగ్‌లు ఎక్కువవుతున్నాయి. ఇవి ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారాయి. దీంతో తమ క్యాడర్‌ను కాపాడుకునేదెలా అంటూ అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మొత్తం దుబ్బాక ఉప ఎన్నికల వైపు చూస్తోంది. ఎప్పుడు.. ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో తెలియని పరిస్థితి నెలకొంటున్నది. కాగా టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు బాధ్యతను తన భుజాన వేసుకున్న మంత్రి హరీశ్ రావు గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహాలు పన్నుతున్నారు. ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా అదేబాటలో నడుస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులను మంత్రి హరీశ్ రావు టీఆర్ఎస్‌లో చేర్చుకుంటుండగా, టీఆర్ఎస్‌లో ఉన్న యువతను, ఇతర అసంతృప్తి నాయకులను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేర్చుకుంటున్నాయి.

తొలుత ట్రబుల్ షూటర్ ప్రత్యర్థి పార్టీలను వ్యూహాత్మంకంగా దెబ్బతీసేందుకు వలసలను ప్రోత్సహించారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ కోమటిరెడ్డి వెంటనర్సింహారెడ్డి, గతంలో కాంగ్రెస్, టీజేఎస్ అభ్యర్థి మద్దుల నాగేశ్వర్ లాంటి నాయకులను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. వలసలపోరులో టీఆర్ఎస్ ముందు నిలవగా బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. యువతే లక్ష్యంగా ఉన్న బీజేపీ పలు పార్టీలో ఉన్న యువకులను తమ వైపు తిప్పుకుంటోంది. గ్రామాల్లో పర్యటిస్తూ అక్కడి యువకులను బీజేపీ కండువా కప్పుతూ తమ పార్టీ లో చేర్చుకుంటుంది.

ఒకే రోజు రెండు పార్టీల్లో..

రాష్ట్ర, జిల్లాస్థాయి నేతలు పార్టీలు ఫిరాయించిన మాదిరిగానే గ్రామస్థాయి కార్యకర్తలు కూడా పార్టీలు మారుతున్నారు. ఉదయం ఒక పార్టీలో కనిపించిన కార్యకర్త సాయంత్రానికి మరో పార్టీలో ఉంటున్నాడు. ఇదంతా చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఒక్కరోజే రెండు పార్టీలు ఎలా ఫిరాయిస్తున్నానని పలువురిని ప్రశ్నించిగా పార్టీ ప్రకటించిన ఆఫర్లు బాగుంటున్నాయనే సమాధానం వారి నుండి బాహాటంగానే రావడం గమన్హారం. ఇలా ఒక పార్టీ నుంచి మరోపార్టీకి చేరికల పర్వం జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితో ఆయా పార్టీల అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. తమ కేడర్‌ ఇతర పార్టీల వైపు మొగ్గు చూపకుండా కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

దుబ్బాకలోనే తిష్ట వేసిన నేతలు..

దుబ్బాక బై ఎలక్షన్ ప్రచారం కోసం పార్టీలు తమ నేతలను దుబ్బాకకు రప్పించాయి. దీంతో దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఇతర ప్రాంతాల నేతలే కనిపిస్తున్నారు. వీరి రాకతో దుబ్బాకలోని చాలా కాలనీల్లో ఇళ్లు ఫుల్ అయ్యాయి. మొన్నటి వరకు టూ లెట్ బోర్డులతో కనిపించిన ఇళ్లు ఇప్పుడు ఇతర ప్రాంతాల నాయకులతో నిండిపోయాయి. అలాగే సిద్దిపేటలోని అన్ని లాడ్జీలు, హోటళ్లల్లో కూడా ఖాళీ రూములు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసినా దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారం కోసం వచ్చిన ఇతర ప్రాంతాల నేతలే దర్శనం ఇస్తున్నారు.

స్థానికులకు ఉపాధి..

దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది అన్న విషయాన్ని అటుంచితే.. స్థానికులకు మాత్రం కొద్దిరోజులైనా ఉపాధి దొరుకుతుందనే చెప్పాలి. టీ కొట్టు నుంచి మొదలు టిఫిన్స్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటళ్లకు గిరాకీలు పెరిగాయి. కరోనా కష్టాలతో సతమతమైన దుబ్బాక ప్రజలకు ఈ బై ఎలక్షన్ కాస్త ఉపాధిని అందిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Next Story

Most Viewed