చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన పార్థసారథి

by  |
ycp leaders
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రైతు వ్యతిరేకి అని మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి విమర్శించారు. చంద్రబాబు మొదటి నుంచి రైతు, ప్రజా వ్యతిరేక ఆలోచనలు చేశారే తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక్క ఆలోచన కూడా చేయలేదన్నారు. బషీర్ బాగ్ కాల్పుల ఘటన ఇందుకు ఒక ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు అడుగడుగునా ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో ప్రజలకు ఇంత మేలు జరుగుతుంటే చూస్తూ ఓర్వలేక పోతున్నారన్నారు. రాష్ట్రం కోసం రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కనీసం పది శాతం కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. చంద్రబాబు పాలన అంతా అవినీతిమయమని విరుచుకుపడ్డారు. దమ్ముంటే కేంద్రానికి వ్యతిరేకంగా చంద్రబాబు ధర్నా చేయాలని సవాల్ విసిరారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కేంద్రాన్ని నిలదీసే దమ్ము లేదని మండిపడ్డారు. రాష్ట్రానికి ఆదాయం ఆగిపోవాలని చంద్రబాబు కుట్రపన్నుతున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేయిస్తున్నారని మండిపడ్డారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా.. రాష్ట్ర ఆదాయాలు పూర్తిగా పడిపోయినా ఎక్కడా సంక్షేమం ఆగలేదని చెప్పుకొచ్చారు.

కరోనా సమయంలో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అండగా నిలిచిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో కుల, మత, ప్రాంతాల్లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. దురదృష్టవ శాత్తు దళితులపై జరిగిన దాడులను కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మాజీమంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు.

Next Story

Most Viewed