ప్రేమించి పెళ్లి చేసుకుందని.. కూతురిని పొడిచిన తండ్రి

by  |
kurnool
X

దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుందనే కక్షతో కూతురిపై కన్నతండ్రే కత్తితో దాడి చేశాడు. నవ వధువు మెడ, పొట్టభాగంపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో నవవధువు తీవ్రంగా గాయపడింది. దీంతో స్థానికులు చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నవ వధువుకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే నంద్యాలకు చెందిన మళ్లీశ్వరి, అదే ప్రాంతానికి చెందిన మంజు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో పది రోజుల క్రితం ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు.

new-couple

అయితే యువతి తల్లిదండ్రులు ఆదివారం మళ్లీశ్వరికి ఫోన్ చేశారు. ఇంటికి రావాలని ఆహ్వానించారు. పెళ్లి ఎలాగూ చేసుకున్నారు..ఇంటికి రావాలని..తమకు ఎలాంటి కోపాలు లేవని నమ్మించారు. ఇది నిజమని నమ్మిన నవ వధువులు యువతి ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లినప్పుడు కాసేపు సరదాగా మాట్లాడారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇంతలో ఒక్కసారిగా యువతి తండ్రి కత్తితో యువతిపై విరుచుకుపడ్డాడు. అతడి బారి నుంచి నవ జంట తప్పించుకుంది. అనంతరం స్థానికుల సహాయంతో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ మళ్లీశ్వరికి వైద్య సేవలు అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న నంద్యాల టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు.



Next Story