వ్యాక్సిన్‌లు లేవు.. వ్యాక్సి‘నేషన్’ ఎలా..?

by  |
వ్యాక్సిన్‌లు లేవు.. వ్యాక్సి‘నేషన్’ ఎలా..?
X

చండీగఢ్ : కొవిడ్-19 వ్యాప్తిని నివారించడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే శ్రీరామరక్ష అని భావిస్తున్న కేంద్రం.. అందుకు పూర్తిగా సన్నద్ధమైనట్టు కనిపించడం లేదు. వచ్చే నెల 1 నుంచి వయోజనులందరికీ వ్యాక్సిన్ వేయాలని ప్రణాళికలు రచించిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు అందుకు తగిన టీకాలను పంపించడంలో విఫలమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. పలు రాష్ట్రాలు దీనిపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఒకవైపు కేంద్రం నుంచి ఎన్ని వ్యాక్సిన్లు వస్తాయో తెలియక సతమతమవుతుండగా.. మరోవైపు టీకా తయారీ సంస్థలు ఎంత మేరకు టీకాలను పంపిస్తాయనే దానిమీద కూడా రాష్ట్రాలకు స్పష్తత లేదు. దీంతో కేంద్రం ప్రకటించిన వయోజనులకు వ్యాక్సినేషన్ ఆర్బాటపు ప్రకటనగానే మిగలనుందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. షెడ్యూల్ ప్రకారమైతే మే 1 నుంచి 18 ఏళ్లు నిండినవారికి వ్యాక్సిన్ వేయాల్సి ఉండగా.. పలు రాష్ట్రాలు అందుకు సిద్ధంగా లేవు. వ్యాక్సిన్ల కొరత ప్రధాన కారణంగా ఉన్నది. ఇప్పటికే ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాలు మే 1 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టలేమని తేల్చి చెప్పాయి. తాజాగా ఈ జాబితాలో పంజాబ్ కూడా చేరింది.

ఇదే విషయమై పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధూ స్పందిస్తూ.. ఆ రోజున (మే 1న) తాము వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేది అనుమానమేనని అన్నారు. “మాకు సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. ఇదే అసలు సమస్య. తగినంత సిబ్బంది, మౌలిక సదుపాయాలు ఉన్నాయి గానీ వ్యాక్సిన్ల కొరత ఉంది” అని తెలిపారు. 30 లక్షల కొవిషీల్డ్ డోసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సీరం ఇనిస్టిట్యూట్‌కు ఆర్డర్ ఇచ్చిందనీ, కానీ సీరం నుంచి ఎన్ని టీకాలు వస్తాయనేది ఇప్పటికీ స్పష్టత లేదని చెప్పారు. బుధవారం పంజాబ్‌కు 2 లక్షల డోసులు వచ్చాయని చెప్పిన బల్బీర్ సింగ్.. కనీసం పది లక్షల డోసులు లేనిదే తాము టీకా కార్యక్రమం ప్రారంభించలేమని వివరించారు. “మా దగ్గర వ్యాక్సిన్ ఉంటేనే కదా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగేదని” అన్నారు.

Next Story

Most Viewed