ఆలస్యం కానున్న బీపీసీఎల్ ప్రభుత్వ వాటా అమ్మకం.. కారణం అదేనా..?

by  |
business news
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి సవాళ్లు, దేశీయ దిగ్గజ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఐపీఓ కారణంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) వాటా అమ్మకం మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బీపీసీఎల్‌లో ప్రభుత్వ వాటా కోసం పెట్టుబడిదారులతో జరుగుతున్న చర్చల పురోగతి మందగించినట్టు సమాచారం. ప్రభుత్వ ఇంధన సంస్థలో మొత్తం 53.98 శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం వేదాంత సహా మూడు సంస్థలు ప్రభుత్వ వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని వ్యక్తం చేశాయి. అయితే, ఇటీవల సెకెండ్ వేవ్ ప్రతికూల పరిణామాలతో పాటు ఎల్ఐసీ ఐపీఓపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో బీపీసీఎల్ ప్రభుత్వ వాటా అమ్మకం 2022 మొదట్లో జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే చర్చలు మందగించినప్పటికీ, ఉపసంహరణ ప్రక్రియపై ప్రభుత్వం వెనక్కి వెళ్లే అవకాశం లేదని, చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం 2 ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక బీమా సంస్థ సహా ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్థిక సంస్థల్లో వాటాలను విక్రయించడం ద్వారా రూ. 1.75 లక్షల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా ఉంది.

ప్రస్తుతానికి ఎల్ఐసీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ) కోసం సన్నాహాలు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. అంచనాల ప్రకారం.. ప్రభుత్వం ఈ ఐపీఓ ద్వారా రూ. 90 వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్లను సేకరించవచ్చు. ఈ క్రమంలోనే గతవారం ప్రభుత్వం ఈ మెగా ఐపీఓ కోసం సలహా ఇచ్చేందుకు మర్చంట్ బ్యాంకర్లు, న్యాయ సలహాదారుల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఐపీఓ ప్రక్రియకు కేంద్రం మంత్రి వర్గం ఆమోదించింది. ఇష్యూ సైజు, ధర, సమయం వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని ప్యానెల్ నిర్ణయించనుంది.


Next Story

Most Viewed