ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్

by  |
ap sec
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. శనివారం ఉదయం 10గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని, తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలకు ఎన్నికలు ఉండవని స్పష్టం చేశారు. తొలి విడతకు జనవరి 25నుంచి 27వరకు నామినేషన్లు, 28న నామినేషన్ల పరిశీలన, జనవరి 30న అభ్యంతరాలపై తుది నిర్ణయం, 31న నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు ఉంటుందన్నారు. ఫిబ్రవరి 5న ఉదయం 6.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్, అదేరోజు సాయంత్రం 4గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తామన్నారు.

ఎన్నికలు సకాలంలో నిర్వహించడం తమ విధి అన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికనే ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం నుంచి మిశ్రమ అనుభవాలు ఉన్నాయని, పంచాయతీ రాజ్ శాఖ సరైన తీరు కనపరచడం లేదన్నారు. విధిలేని పరిస్థితుల్లో 2019 రోల్ ప్రాతి పదికనే ఎన్నికలు జరుపబోతున్నామని, దీనివల్ల 3లక్షలకు పైగా కొత్త ఓటర్లు హక్కు కోల్పోతున్నారన్నారు. పంచాయతీ రాజ్ శాఖ బాధ్యతా రాహిత్యం వల్లనే ఈ దుస్థితి వచ్చిందన్నారు.

ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఎన్నికల ప్రకియ ప్రారంభమైందని, భిన్నమైన స్వరాలు ఉన్నా కూడా ఎన్నికల నిర్వహణపై ప్రభావం ఉండదని ఎస్ఈసీ నిమ్మగడ్డ అన్నారు. ఎన్నికల్లో హింస, పోటీలో అవరోధాలు కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల నిర్వహణతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని, అప్పుడే విధులు, నిధులు సరిగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.


Next Story

Most Viewed